తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.సాంకేతిక సమస్యల అధిగమించి నిర్మాణాలు పూర్తి చేయాలి.పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలి. రెండో విడత నిర్మాణాలకు పక్కా ప్రణాళిక రూపొందించండి.సమీక్షా సమావేశంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.మొదటి విడత కింద ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కొత్తగూడెంలోని క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ, మున్సిపల్ కార్పొరేషన్, మండల ప్రజాపరిషత్ అధికారులతో ఇండ్ల నిర్మాణ పురోగతిపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో నిర్మాణాల్లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించి, పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న ఇండ్ల నిర్మాణాలను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్క పేదవానికి సొంతింటి కల నెరవేరేలా యంత్రాంగం పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. అదేవిధంగా రాబోయే రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు సంబంధించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తుగానే పక్కా ప్రణాళికలతో సంసిద్ధంగా ఉండాలని అధికారులను కోరారు. ప్రజాధనం వృథా కాకుండా, నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేస్తూ పేదలకు నాణ్యమైన ఇళ్లను అందించడంలో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న ఇతర అభివృద్ధి పనులపై ద్రుష్టి సారించి నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. సమీక్షా సమావేశంలో కార్పొరేషన్ కమిషనర్ సుజాత, చుంచుపల్లి ఎంపిడివో సుభాషిణి, లక్ష్మీదేవిపల్లి ఎంపిడివో సుస్మిత, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ