తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : లక్ష్మీదేవి పల్లి మండలం రేగళ్ల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయనఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, ఔషధ నిల్వలు, శుభ్రత, రోగులకు అందిస్తున్న సేవల నాణ్యతను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. ఆసుపత్రిలో ఉన్నటువంటి ఆపరేషన్ గది మరియు లేబర్ రూమును కలెక్టర్ పరిశీలించి ఆపరేషన్ గదిలో మందులు నిల్వ ఉండటాన్ని గమనించి ఇక్కడ ఎందుకు నిల్వ చేశారు, ఆపరేషన్ థియేటర్ ఉపయోగిస్తున్నారా లేదా అని వైద్యులను ప్రశ్నించారు. వైద్యులు మూడు నెలలకు సంబంధించి మందులను ముందుగా నిల్వ చేసినట్లు తగిన ప్రదేశం లేక ఇక్కడ నిల్వ చేసినట్లు వివరించారు. ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్ సిబ్బందిని అభినందించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రజల్లో ప్రభుత్వ వైద్య వ్యవస్థపై నమ్మకం పెరగాలి అని పేర్కొన్నారు.ఆరోగ్య కేంద్రాలు గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలందించాలంటే వైద్యులు, ఆరోగ్య సిబ్బంది తమ విధుల్లో నిబద్ధతతో, సమయపాలన పాటిస్తూ సేవలందించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. ఆసుపత్రిలో రోగుల కోసం అవసరమైన రక్తపరీక్షలు, సీజనల్ వ్యాధుల నివారణకు మందుల సరఫరా, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.వర్షాకాలం నేపథ్యంలో దోమల వల్ల వ్యాపించే వ్యాధులు ఎక్కువగా ఉన్నందున తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.ప్రజల ఆరోగ్యం సంరక్షణలో ఆరోగ్య కేంద్రాల పాత్ర కీలకమని అన్నారు. ఆసుపత్రి రికార్డుల నిర్వహణ, వైద్య సేవల నాణ్యత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులకు సిబ్బందికి సూచించారు. ఆస్పత్రి ఆవరణలో నాటిన మునగ, కరివేపాకు మరియు ఉసిరి చెట్లను కలెక్టర్ పరిశీలించి ఇంకా మిగతా ఖాళీ ప్రదేశంలో కూడా ఈ మొక్కలను నాటాలని సూచించారు.ఈ తనిఖీలో కలెక్టర్ వెంట ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ