తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆరోగ్యం క్షీణించి దంతెలబోర సిపిఐ సర్పంచి వెంకటరవణ మృతి. వెంకటరవణ మృతికి కూనంనేని, సాబీర్ పాషా సంతాపం. సర్పంచి కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే కూనంనేని. పాల్వంచ మండలం దంతెలబోర (ఎస్సీ కాలనీ) సిపిఐ పక్ష సర్పంచి సిడెం వెంకటరవణ (34) శుక్రవారం రాత్రి తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. ఇటీవల కాలు గాయంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు మొదట భద్రాచలంలోని మిమ్స్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో భద్రాచలం వైద్యులు ఖమ్మంకు రిఫర్ చేశారు. ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. వెంకటరవణకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదట భద్రాచలంలో అందించిన వైద్యం వికటించడం వల్లే ఆమె మృతిచెందిందని భావించిన కుటుంబ సభ్యులు భద్రాచలం ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు. అయితే, చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలను వైద్య బృందం వారికి వివరించడంతో సంతృప్తి చెందిన కుటుంబ సభ్యులు నిరసనను విరమించుకున్నారు. అనంతరం మృతదేహాన్ని ఆమె స్వగ్రామమైన దంతెలబోరకు తరలించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలు అందించిన వెంకటరవణ మృతిపట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు వి. పూర్ణచందర్, అడుసుమిల్లి సాయిబాబు, యు. రాహుల్ తదితరులు తమ సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రజాసేవలో ముందంజలో ఉన్న యువ నాయకురాలిని కోల్పోవడం తీరని లోటని, వెంకటరవణ కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారుభరోసా ఇచ్చారు.
Admin
తెలుగు వెలుగు టీవీ