తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 22న బూర్గంపాడు లో మాక్ డ్రిల్.. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర విపత్తుల సమయంలో సమర్థవంతమైన స్పందనతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు ముందస్తు అప్రమత్తత అత్యంత అవసరమని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఈ నెల 22వ తేదీన విపత్తుల నిర్వహణపై మాక్ డ్రిల్ నిర్వహించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనలతో కలిసి విపత్తుల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (EOC)ను జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విపత్తుల సమయంలో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లాలో EOC కీలక పాత్ర పోషిస్తుందని, ఇందులో జిల్లా స్థాయి అధికారులు,రెవెన్యూ, ఇరిగేషన్, వైద్య, ఫైర్, పోలీస్, SDRF, NDRF తదితర విభాగాలు సభ్యులుగా ఉండాలని తెలిపారు. EOC ద్వారా విపత్కర పరిస్థితుల్లో చేపట్టవలసిన జాగ్రత్తలు, ముందస్తు చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన సామాగ్రి, వనరులు, పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. విపత్తు పరిస్థితులను ముందుగానే అంచనా వేయగలిగితే నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చని కలెక్టర్ తెలిపారు. ఇందుకోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, విధుల్లో ఎలాంటి అలసత్వం లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సమాచార మార్పిడి అత్యంత కీలకమని, అందుబాటులో ఉన్న అన్ని సమాచార, సాంకేతిక సాధనాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.వర్షపాతం వివరాలు, ప్రాజెక్టులు మరియు రిజర్వాయర్ల నీటిమట్టం, నీటి విడుదల, వంతెనలు, రోడ్ల ప్రస్తుత పరిస్థితి వంటి అంశాలపై రియల్ టైమ్ సమాచారం ప్రజలకు చేరవేయాలని ఆదేశించారు. అలాగే జిల్లా మ్యాప్తో పాటు అవసరమైన అన్ని మ్యాపులు సిద్ధంగా ఉంచాలని, వరదలు సంభవించినప్పుడు క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన చర్యలు, పునరావాస కేంద్రాల గుర్తింపు, పునరావాస కేంద్రాల్లో కల్పించవలసిన సదుపాయాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని తెలిపారు. అత్యవసర సమయాల్లో ప్రజలకు అవసరమయ్యే ఆరోగ్య, అగ్నిమాపక, పోలీస్, రెవెన్యూ, విద్యుత్, తాగునీరు, మునిసిపల్ సేవలు తదితర విభాగాలకు సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్లు, హెల్ప్లైన్ వివరాలు ప్రజలందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. లైఫ్ జాకెట్లు, బోట్లు, ఇతర రక్షణ సామాగ్రి అందుబాటులో ఉంచాలని, పోలీస్ విభాగం నుంచి అవసరమైన సమాచార వ్యవస్థను పటిష్టం చేయాలని ఆదేశించారు. గోదావరి నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహించినప్పుడు తీసుకోవలసిన చర్యలపై స్పష్టమైన కార్యాచరణ ఉండాలని, దీనిని ఆచరణలో పరీక్షించేందుకు ఈ నెల 22న బూర్గంపాడులో మాక్ డ్రిల్ నిర్వహించాలని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మాక్ డ్రిల్ సందర్భంగా విపత్తు నిర్వహణ ప్రణాళికల అమలు, శాఖల మధ్య సమన్వయం, స్పందన వేగం, రక్షణ చర్యలు, సహాయక సేవల అందుబాటు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించాలని తెలిపారు. ఈ మాక్ డ్రిల్ ద్వారా లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దుకొని వాస్తవ విపత్తుల సమయంలో మరింత సమర్థవంతంగా పనిచేయవచ్చని తెలిపారు. విపత్తుల నిర్వహణలో ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని, ప్రతి అధికారి తన పరిధిలోని సిబ్బందికి తగిన శిక్షణ అందించి, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడే దిశగా కట్టుదిట్టంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ మురళీ, జెడ్పి సీఈవో నాగలక్ష్మి, సిపిఓ సంజీవరావు పంచాయతీరాజ్ ఈ ఈ శ్రీనివాసరావు, ఆర్ టి ఓ వెంకటరమణ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ