తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మాక్ పార్లమెంట్ నిర్వహణ.ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహిళా వారోత్సవాల సందర్భంగా శనివారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కౌమారదశ బాలికలతో మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరై బాలికలు నిర్వహించిన మాక్ పార్లమెంట్ను పరిశీలించారు. బాల్య వివాహాల నిర్మూలన, మహిళల భద్రత, మహిళా హక్కులు, విద్య ప్రాధాన్యత వంటి అంశాలపై బాలికలు నిర్వహించిన చర్చలను అభినందించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మాక్ పార్లమెంట్ ద్వారా బాలికలకు పార్లమెంటరీ వ్యవస్థ, చట్టసభల పనితీరు, ప్రశ్నోత్తరాల సమయం, బిల్లుల ప్రవేశపెట్టడం, చట్టాల రూపకల్పన వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే మహిళా సాధికారత, ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళల పాత్ర, సామాజిక బాధ్యతలు, నాయకత్వ లక్షణాల అభివృద్ధి వంటి అంశాలపై చర్చలు నిర్వహించారు. బాల్య వివాహాల నిర్మూలన, మహిళల భద్రత, మహిళా హక్కులు, సమాజ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం వంటి కీలక అంశాలను మాక్ పార్లమెంట్లో ప్రస్తావించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, బాలికల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, నిర్ణయ సామర్థ్యం, సామాజిక బాధ్యత పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ, చట్టసభల పనితీరు, చట్టాల రూపకల్పన ప్రక్రియ, ప్రజాప్రతినిధుల బాధ్యతలు, పౌరుల హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించడమే మాక్ పార్లమెంట్ నిర్వహణ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.జిల్లావ్యాప్తంగా 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల కౌమారదశ బాలికల కోసం ప్రత్యేకంగా 529 స్నేహ గ్రూపులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. స్వయం సహాయక సంఘాల తరహాలో ఏర్పాటు చేసిన ఈ స్నేహ గ్రూపుల ద్వారా బాలికల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సామాజిక చైతన్యం పెంపొందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ స్నేహ గ్రూపుల సభ్యులైన బాలికలతోనే మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు.పార్లమెంట్ ఎలా పనిచేస్తుంది, ప్రజలకు సంబంధించిన అంశాలు ఎలా చర్చకు వస్తాయి, బిల్లులు ఎలా ప్రవేశపెడతారు, చట్టాలు ఎలా రూపొందుతాయి వంటి అంశాలను బాలికలు తెలుసుకోవడం అవసరమని కలెక్టర్ అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చలు, వాదోపవాదాలు కీలకమైనవని, ప్రతి చట్టం ప్రజల అవసరాలు, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించబడుతుందని తెలిపారు.చట్టాలను రూపొందించడం శాసన వ్యవస్థ బాధ్యత కాగా, వాటిని అమలు చేయడం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత అని కలెక్టర్ వివరించారు. చట్టాల అమలు తీరును న్యాయవ్యవస్థ పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం అనేది ప్రజల భాగస్వామ్యంతో నడిచే గొప్ప వ్యవస్థ అని, దాని గురించి ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.బాల్య వివాహాల నిర్మూలన, మహిళల భద్రత, మహిళా హక్కులు, వరకట్న నిషేధం, లింగ సమానత్వం, బాలికల విద్య వంటి అంశాలపై కౌమారదశలోనే అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. విద్యతో పాటు సామాజిక, రాజ్యాంగ, రాజకీయ అంశాలపై అవగాహన కలిగి ఉంటే బాలికలు భవిష్యత్తులో సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించగలరని తెలిపారు.అనంతరం బాలికలు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రోహిత్ రాజుతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాలు, సమాజంలో ఎదురవుతున్న వివిధ సమస్యలపై బాలికలు ప్రశ్నలు అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి సరఫరా వల్ల యువత, కుటుంబాలపై పడుతున్న ప్రతికూల ప్రభావాలు, బెల్ట్ షాపులు, గుడుంబా వంటి మద్యపాన వ్యసనాల కారణంగా చిన్న వయస్సులోనే యువత బానిసలుగా మారుతున్న పరిస్థితులు, వాట్సాప్ తదితర సోషల్ మీడియా వేదికల ద్వారా అపరిచితులతో పరిచయాల వల్ల ఎదురయ్యే ప్రమాదాలు, గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న బాల్య వివాహాల సమస్యలపై చర్చ జరిగింది. ఈ అంశాలపై ఎస్పీ బాలికలకు చట్టపరమైన నిబంధనలు, భద్రతా చర్యలు, జాగ్రత్తలపై సమగ్ర అవగాహన కల్పించారు.జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి బాల్య వివాహాల నిర్మూలన, బాలల హక్కులు, బాలలపై హింస మరియు గృహహింస నివారణ, బాలల రక్షణకు సంబంధించిన చట్టాలు, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. సమాజంలో బాలికలు ధైర్యంగా ముందుకు సాగేందుకు, తమ హక్కులను తెలుసుకొని వినియోగించుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అధికారులు తెలిపారు .ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, అడిషనల్ డి ఆర్ డి ఓ బి.నీలేష్,జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సోయం సుజాత , జడ్పీ సీఈఓ & డీఈఓ నాగలక్ష్మి, సీపీఓ సంజీవరావు, డీడబ్ల్యూఓ స్వర్ణ లెనినా , డీపీఎంలు, ఏపీఎంలు, కిషోర బాలికల సంఘాల సభ్యులు, ఇతర సంబంధిత శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ