తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామ సభకు జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్థులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మార్చి 6వ తేదీ నుండి అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా అమలు చేయబడుతోందని తెలిపారు.గ్రామ సభలు ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలను చేరవేసే సమర్థవంతమైన వేదికలని అన్నారు. విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్యం, వర్షాకాలంలో అంటువ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువవుతున్నాయని అన్నారు .రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు పంట మార్పిడి విధానాలను అనుసరించాలని, వ్యవసాయ శాఖ సూచనల మేరకు శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని సూచించారు. ఎరువులు, పురుగుమందుల వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పంటల దిగుబడులు పెరిగేలా ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని రైతులకు సూచించారు.గ్రామాల్లో సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని, తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే అలవాటు ప్రతి కుటుంబం అలవరుచుకోవాలని కోరారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఎస్ఐఆర్ను సమర్థవంతంగా అమలు చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా అవగాహన కల్పించాలని సూచించారు. అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించడం, అనర్హుల పేర్లను జాబితా నుండి తొలగించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు.బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక మౌలిక వసతులు, డిజిటల్ విద్య, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు తదితర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, రైతులు, గ్రామస్థులు పంట పొలాలకు వెళ్లే రహదారుల అభివృద్ధి, గ్రామంలోని విద్యుత్ అదనపు లైన్లు , అంతర్గత రహదారుల నిర్మాణం, తాగునీటి కి ఆర్వో వాటర్ ప్లాంట్ ఎర్పాటు వంటి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలపై స్పందించిన కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను వెంటనే చర్యలు చేపట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామారావు, డి ఆర్ డి ఓ విద్యా చందన, మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ