తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పాల్వంచ వైద్య ఆరోగ్య శాఖ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంగా ఉన్న జిల్లాలో ప్రజలకు నాణ్యమైన మరియు అందుబాటులో ఉన్న వైద్య సేవలను అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడం అత్యంత కీలకమని, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ నమ్మకాన్ని నిలబెట్టడం ప్రతి అధికారి, సిబ్బందిపై ఉన్న బాధ్యతగా తెలిపారు.ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 6 నుండి 11వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఇతర జిల్లాలతో పోలిస్తే ఈ జిల్లాలో ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు ఉన్న నమ్మకం విశేషమని తెలిపారు .క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రాష్ట్ర స్థాయి అవార్డులను స్వీకరించేందుకు హైదరాబాద్లోని రవీంద్ర భారతికి వెళ్లినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయితో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో కూడా అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి తుకారాం రాథోడ్ మాట్లాడుతూ, జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సేవలు మరియు ఆరోగ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 43 మంది ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ అంకిత్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో తాసిల్దారు దారా ప్రసాద్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ ప్రసాద్ నాయక్, డాక్టర్ స్పందన, డాక్టర్ తేజస్వి, వైద్య శాఖ సిబ్బంది సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ