Tuesday, 28 July 2026 02:16:35 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

సింగరేణి భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు

Date : 24 July 2026 12:31 PM Views : 132

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణిని లాభాల బాటలో నడిపించడం అందరి బాధ్యత పోటీ ప్రపంచంలో సింగరేణిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా కార్యాచరణ చేపట్టాలి కొత్త బొగ్గు బ్లాకుల అభివృద్ధితో పాటు క్రిటికల్ మినరల్స్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లోకి విస్తరించాలి సమిష్టి కృషితో సింగరేణిని మరింత బలోపేతం చేయాలి సింగరేణి సంస్థను కాపాడుకోవడం, లాభాల బాటలో నడిపించడం, పోటీ ప్రపంచంలో మరింత బలోపేతం చేయడం, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, యాజమాన్యం అందరి ఉమ్మడి బాధ్యత అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సింగరేణి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, సంస్థ భవిష్యత్తుకు అవసరమైన ప్రతి నిర్ణయానికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్), తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (టీఎస్‌జెన్‌కో) ఉన్నతాధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, జిల్లా కలెక్టర్ అంకిత్, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, ఎస్‌సీసీఎల్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్, ఐఏఎస్, టీఎస్‌జెన్‌కో ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ హరీష్, ఐఏఎస్, ఎస్‌సీసీఎల్ డైరెక్టర్ (పర్సనల్, అడ్మినిస్ట్రేషన్ & వెల్ఫేర్) గౌతమ్ పొట్రూ, జనరల్ మేనేజర్లు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్‌సీసీఎల్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంస్థ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, బొగ్గు ఉత్పత్తి, కొత్త బొగ్గు గనుల అభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, ఆధునిక సాంకేతికత వినియోగం, ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ, సంస్థ దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణకు సింగరేణి ఆత్మవంటిదని, 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ సంస్థను కాలానుగుణంగా మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒకప్పుడు బొగ్గు ఉత్పత్తి రంగంలో సింగరేణిదే ఏకఛత్రాధిపత్యమని, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల బహిరంగ వేలం విధానాన్ని అమలు చేయడంతో అనేక ప్రైవేట్ సంస్థలు రంగంలోకి వచ్చి పోటీ తీవ్రంగా పెరిగిందన్నారు. ఈ పరిస్థితుల్లో నాణ్యత, ఉత్పాదకత, ఆధునిక సాంకేతికత, వ్యయ నియంత్రణ ద్వారా పోటీతత్వాన్ని పెంచుకుంటేనే సింగరేణి భవిష్యత్తు మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఒకప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్ దేశంలో అత్యంత బలమైన ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నప్పటికీ పెరుగుతున్న పోటీని సమర్థంగా ఎదుర్కోలేక వెనుకబడిన విషయాన్ని గుర్తు చేస్తూ, అలాంటి పరిస్థితి సింగరేణికి రాకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు.

జెన్‌కోతో పాటు ఇతర విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు సరఫరా చేసే బొగ్గు అత్యున్నత నాణ్యతతో ఉండాలని స్పష్టం చేశారు. తవ్వకాల సమయంలో బొగ్గులో మట్టి, రాళ్లు, ఇతర మలినాలు కలవకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట బొగ్గు వాషింగ్ చేపట్టి యాష్ కంటెంట్ తగ్గించాలని సూచించారు. గ్రేడ్-4, గ్రేడ్-5, గ్రేడ్-6 ప్రమాణాల ప్రకారం బొగ్గును శాస్త్రీయంగా బ్లెండింగ్ చేసి సరఫరా చేయడం ద్వారా వినియోగదారుల విశ్వాసం పెరుగుతుందని, మార్కెట్లో సింగరేణి ప్రత్యేకత మరింత పెరుగుతుందని తెలిపారు. సింగరేణి లాభాల్లో ఉంటేనే వేలాది మంది కార్మికులు, వారి కుటుంబాల భవిష్యత్తు భద్రంగా ఉంటుందని పేర్కొంటూ, సంస్థను లాభాల బాటలో నడిపించడం ప్రతి అధికారి, ఉద్యోగి, కార్మికుడి బాధ్యత అని స్పష్టం చేశారు. జనరల్ మేనేజర్లు, డైరెక్టర్లు, అధికారులు, కార్మికులు కలిసి ప్రతి గని స్థాయిలో చర్చలు నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. సొంత కుటుంబ అభివృద్ధికి చూపే నిబద్ధతతోనే సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత దశాబ్ద కాలంలో కొత్త బొగ్గు బ్లాకుల అభివృద్ధిలో ఆశించిన పురోగతి సాధించలేకపోయామని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి, యాదాద్రి, భద్రాద్రి తదితర థర్మల్ విద్యుత్ కేంద్రాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త బొగ్గు బ్లాకులను గుర్తించి వేగంగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒడిశాలోని నైనీ బ్లాక్, తాడిచర్ల-2 ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, అటవీ అనుమతుల సమస్యలను వేగంగా పరిష్కరించినట్లు తెలిపారు. రాబోయే 15 నుంచి 20 ఏళ్లలో ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్న నేపథ్యంలో సింగరేణి కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా థర్మల్ పవర్, సోలార్, పంప్డ్ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో కూడా విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, చిప్ తయారీకి అత్యంత కీలకమైన లిథియం, కోబాల్ట్, రేర్ ఎర్త్ మినరల్స్ వంటి క్రిటికల్ మినరల్స్ అన్వేషణ, మైనింగ్ రంగంలో సింగరేణి ప్రవేశించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఖనిజాలకు భారీ డిమాండ్ ఉన్నందున ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో క్రిటికల్ మినరల్స్ బ్లాకుల వేలంలో పాల్గొనే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. సింగరేణిలో ఉన్న మైనింగ్ నిపుణులు, ఇంజనీర్లు, కార్మికుల అనుభవాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టుల్లో వినియోగించి సంస్థకు కొత్త ఆదాయ వనరులు సృష్టించాలని పేర్కొన్నారు. ఇకపై సింగరేణి బోర్డు సమావేశాలు కేవలం పరిపాలనా అంశాలకు పరిమితం కాకుండా సంస్థ విస్తరణ, పెట్టుబడులు, సాంకేతిక ఆధునికీకరణ, రాబోయే పదేళ్ల అభివృద్ధి వ్యూహంపై చర్చించే వేదికగా మారాలని సూచించారు. కార్పొరేట్ సంస్థల మాదిరిగా స్పష్టమైన లక్ష్యాలు, కాలపట్టిక రూపొందించి నిర్దిష్ట గడువులో పనులు పూర్తి చేసే విధంగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా పనులను వేగవంతం చేయాలని, వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ అంశాలను ప్రతిరోజూ సమీక్షిస్తూ ప్రత్యేక కార్యాచరణతో పరిష్కరించాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయంతో నిర్ణీత గడువులో లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఎల్-నినో ప్రభావం నేపథ్యంలో సింగరేణి సంస్థ తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై కూడా సమావేశంలో సమీక్ష నిర్వహించారు. సంబంధిత శాఖలు సమన్వయంతో ముందస్తు కార్యాచరణ చేపట్టి ఎల్-నినో ప్రభావాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఆదాయం ఆర్జించే ప్రభుత్వ రంగ సంస్థగా సింగరేణిని మరింత అభివృద్ధి చేసి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే సంస్థగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ఉద్యోగులు, కార్మికులు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పిలుపునిచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో సింగరేణి సంస్థ జనరల్ మేనేజర్లు, డైరెక్టర్లు, జెన్‌కో అధికారులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :