తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం.పాత్రికేయవృత్తి ఎంతో సంతృప్తినిచ్చింది -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ.ఘనంగా 43 వసంతాల విజయోత్సవ వేడుక తెలుగువారి ఆరాధ్య దైవమైన శ్రీరాముడు కొలువై ఉన్న జిల్లాలో, భూమాత ప్రసాదించిన బొగ్గుకు పుట్టినిల్లయిన ఇల్లందులో జర్నలిస్టుగా పనిచేయటం ఎంతో అదృష్టం అని సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ అన్నారు. 1983లో ఇల్లందులో అడుగుపెట్టి జర్నలిస్టుగా వివిధ పత్రికల్లో పనిచేసిన సూర్యనారాయణ 43 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మిత్రులు, శ్రేయోభిలాషులు సోమవారం 43 సంవత్సరాల విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సూర్యనారాయణ మాట్లాడుతూ చిన్నప్పటినుండి తనకు జర్నలిజం అంటే చాలా ఇష్టమని పేర్కొంటూ తన పాత్రికేయ ప్రయాణం ఇల్లందులోనే ప్రారంభమైందని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి, సమాజానికి విశేషమైన సేవలు అందించడానికి ఎంతో బాధ్యతాయుతమైన పాత్రికేయవృత్తి తనకు గొప్ప అవకాశాన్ని ఇచ్చిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్ లోనే తన పాత్రికేయవృత్తి ప్రారంభమైందని, ఈ రెండు దినపత్రికలు తనను ఒక మంచి పాత్రికేయునిగా తీర్చిదిద్దాయని, ఈ విషయం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. వృత్తిలో ఎంతోమంది ప్రతిభావంతులైన జర్నలిస్టులతో కలిసి పనిచేసే అవకాశం తనకు లభించిందని, వృత్తిలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ, అంకితభావంతో విధులను నిర్వర్తించి ప్రజల ఆదరణ పొందటం ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు. నాలుగు దశాబ్దాల క్రితం సమాజంలో జర్నలిస్టులు చాలా తక్కువ మంది ఉండేవారని, జర్నలిస్టుల పట్ల ప్రజలకు ప్రత్యేక గౌరవం ఉండేదని, అప్పట్లో జర్నలిస్టుగా చెప్పుకోవడం గర్వకారణంగా ఉండేదని అన్నారు. 1983లో ఇల్లందులో ఒక చిన్న మొక్కగా ఉన్న పాత్రికేయరంగం నేడు ఒక మహావృక్షంగా మారిందని ఆయన హర్షం వ్యక్తంచేశారు. సమాజంలో వృత్తినే దైవంగా భావించి సంవత్సరాల తరబడి పత్రికారంగంలో విశేష సేవలు అందించిన జర్నలిస్టులను గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. నేడు పత్రికారంగంలో సాంకేతిక విజ్ఞానం విశేషంగా అభివృద్ధి చెందిందని, ఎటువంటి వ్యయప్రయాసాలు లేకుండా జర్నలిస్టులు వార్తావిశేషాలను ప్రజలకు ఎప్పటికప్పుడు అందిస్తున్నారని ఆయన కొనియాడారు. కాలానుగుణంగా దినదినాభివృద్ధి చెందుతున్న పాత్రికేయరంగంలో అంకితభావంతో విధులను నిర్వర్తించి వృత్తి గౌరవాన్ని పెంచవలసిన బాధ్యత జర్నలిస్టులపై ఉందని అన్నారు. రానున్నకాలంలో మీడియారంగం ఉజ్వలమైన భవిష్యత్తు కలిగి ఉండాలని, జర్నలిస్టులకు ఎంతో మేలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సుదీర్ఘకాలంలో తనతో పనిచేసిన జర్నలిస్టులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ