తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 148.03 లక్షల మెట్రిక్ టన్నులతో తెలంగాణ ధాన్యం ఉత్పత్తిలో చరిత్ర సృష్టించింది... రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరపండి.. ధాన్యం కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్లతో మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి. డాక్టర్ బి.ఆర్. అంబెడ్కర్ సచివాలయంలో ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఈ వానాకాలంలో తెలంగాణ రాష్ట్రం ధాన్యం దిగుబడిలో చరిత్రాత్మక రికార్డు సృష్టించిందని తెలిపారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యధికంగా 148.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి నమోదైందని, ఇది రైతుల కష్టానికి నిదర్శనమని అన్నారు. అధిక దిగుబడి దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి, ధాన్యం కొనుగోళ్లు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొంటూ, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, రవాణా వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రైతులు ఎక్కడా నిరీక్షించాల్సిన పరిస్థితి లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోలు వివరాలను వెంటనే నమోదు చేసి, 48 గంటల లోపు రైతులకు చెల్లింపులు జరిగేలా చూడాలని సూచించారు. అలాగే ధాన్యం తరలింపు, నిల్వ మరియు మిల్లర్లతో సమన్వయం విషయంలో జిల్లా స్థాయిలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. అవసరమైతే మౌలిక సదుపాయాల కల్పన కోసం అదనపు ఖర్చులకు వెనుకాడరాదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లింపులకు కూడా సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. గడిచిన యాసంగి సీజన్లో కలెక్టర్ల సమన్వయంతో సత్ఫలితాలు సాధించామన్నారు. ఈ వానాకాలంలో అధిక దిగుబడి దృష్ట్యా అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. “ఎటువంటి సమస్యలు వచ్చినా తక్షణమే నన్ను లేదా పౌర సరఫరాల కమిషనర్ను సంప్రదించండి. మేము 24 గంటలు అందుబాటులో ఉంటాం” అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని, రైతులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ లతో కలిసి క్యాంపు కార్యాలయం నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ వానాకాలం ధాన్యం కొనుగోళ్లను పూర్తిస్థాయిలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలతో సమన్వయం కల్పించామని తెలిపారు. జిల్లాలో మొత్తం 193 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, సుమారు 2,38,177 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరగవచ్చని అంచనా వేశామని వివరించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాల వద్ద తాగునీరు, విశ్రాంతి గదులు, తూకం యంత్రాలు, తడిపరీక్ష పరికరాలు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. అలాగే కొనుగోలు చేసిన ధాన్యాన్ని వేగంగా తరలించేందుకు రవాణా వసతులు, నిల్వ గోదాములు, మిల్లర్లతో సమన్వయం చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటల్లోపే చెల్లింపులు జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ వానాకాలం కొనుగోళ్లు రైతులకు సౌకర్యవంతంగా, పారదర్శకంగా సాగేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, పౌరసరఫరాల అధికారిని రుక్మిణి మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ