తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ను సింగరేణికే కేటాయించాలని 2013లోనే ఎఐటియుసి ఉద్యమాన్ని ప్రారంభించిందని, అనంతరం 2017 మే 12 నుంచి 18 వరకు "సింగరేణి జాతా" పేరుతో తాడిచర్ల–2 ప్రాజెక్టును సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ బస్సు యాత్ర నిర్వహించిన ఏకైక కార్మిక సంఘం ఎఐటియుసి మాత్రమేనని అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య తెలిపారు.కార్పొరేట్ ఏరియా మెయిన్ వర్క్షాప్లో గురువారం నిర్వహించిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ, కార్మికుల పట్ల యాజమాన్యం అవలంబిస్తున్న మొండి వైఖరిని తీవ్రంగా ఖండించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి, కార్మికులకు రావాల్సిన లాభాల వాటాను చెల్లించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా, పెర్క్స్పై విధిస్తున్న ఆదాయ పన్నును రద్దు చేయాలని, సింగరేణి వ్యాప్తంగా గనులు, వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలన్నింటినీ తక్షణమే భర్తీ చేయాలని కోరారు.రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ, లిక్కర్ స్కామ్లో బెయిల్పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం "బయ బాట" పేరుతో కార్మికుల ముందుకు వచ్చి ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. గత పదేళ్ల పాలనలో కార్మికుల సంక్షేమం కోసం చెప్పుకోదగ్గ చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు సానుభూతి కోసం మాట్లాడడం సమంజసం కాదన్నారు. కార్మికులు అన్ని విషయాలను నిశితంగా గమనిస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి, ఉపాధ్యక్షుడు క్రిస్టోఫర్, పిట్ కార్యదర్శి సుధీర్, నాయకులు వేమన చారి, దినేష్, సత్యనారాయణ, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ