తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విలువైన వస్తువులను లాకర్లలో గానీ,సురక్షిత ప్రదేశాల్లో గానీ భద్రపరుచుకోండి : జిల్లా ప్రజలకు ఎస్పీ రోహిత్ రాజు సూచనలు సంక్రాంతి పండుగ సెలవుల సందర్బంగా ఇండ్లకు తాళం వేసి దూరప్రాంతాలకు ప్రయాణాలు చేసే వారికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పలు కీలక సూచనలు చేశారు.పండుగ సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి ఎక్కువ రోజులు బయటికెళ్లే వారు ముందు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. పండుగ సెలవులకు చాలా మంది కుటుంబ సమేతంగా ఊర్లకు వెళ్తుంటారని,ఇదే అదనుగా భావించి దొంగలు చోరీలకు పాల్పడే అవకాశముందని ఎస్పీ పేర్కొన్నారు.ప్రయాణానికి ముందే సమీపంలోని పోలీస్ స్టేషన్లో సమాచారం అందిస్తే,పెట్రోలింగ్లో భాగంగా సిబ్బంది ఆయా ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతారని తెలిపారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు నగదు,బంగారం ఇతర విలువైన వస్తువులను ఇంట్లో ఉంచరాదని ఎస్పీ సూచించారు.వాటిని బ్యాంకు లాకర్లలో లేదా ఇతర సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకోవడం ఉత్తమమని సూచించారు.ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా చోరీలను నివారించవచ్చని,తద్వారా పండుగను ప్రశాంతంగా జరుపుకోవచ్చని పేర్కొన్నారు. నేరాలు జరిగిన తర్వాత స్పందించడమే కాదు,నేరాలను ముందుగానే నివారించడం కూడా పోలీసుల భాద్యతేనని,ఇందుకు ప్రజల సహకారం చాలా అవసరం అని తెలిపారు.పండుగ సీజన్లో శాంతిభద్రతల పరిరక్షణకు,మీ ఇళ్ల భద్రతకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు.అత్యవసర సమయంలో వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని ఎస్పీ సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ