తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఫిబ్రవరి 18వ తేదీ నుండి ప్రారంభమయ్యే పవిత్ర రంజాన్ మాసాన్ని దృష్టిలో ఉంచుకొని, జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధ్యక్షతన రంజాన్ మాసంలో చేపట్టవలసిన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని మసీదుల పరిసరాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, మసీదు ఆవరణల్లో ఉన్న పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించి పరిశుభ్రతను కాపాడాలని పంచాయతీ రాజ్ మరియు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అలాగే త్రాగునీటి సరఫరా నాణ్యతను మెరుగుపర్చేందుకు బావులు, నీటి ట్యాంకులను శుభ్రపరచి బ్లీచింగ్ పౌడర్ వినియోగించాలని సూచించారు.రంజాన్ మాసంలో ప్రార్థన సమయాలను దృష్టిలో ఉంచుకొని రెండు పూటలా త్రాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ప్రార్థన సమయాల్లో విద్యుత్ అంతరాయం కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రతి మసీదు పరిధిలోని లైన్మన్ ఫోన్ నంబర్లను మసీదు పెద్దలకు అందుబాటులో ఉంచాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు.ప్రార్థనా మందిరాల వద్ద అత్యవసర పరిస్థితుల కోసం అంబులెన్సులు అందుబాటులో ఉండే విధంగా పర్యవేక్షణ చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే ప్రార్థనా మందిరాల వద్ద శాంతిభద్రతలు కాపాడేందుకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని పోలీస్ శాఖ అధికారులకు సూచించారు.రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పాలు తదితర నిత్యావసర వస్తువులు సరిపడా అందుబాటులో ఉండేలా డైరీ అభివృద్ధి శాఖ అధికారులతో సమన్వయం చేసి తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అలాగే జిల్లాలో ఉన్న అన్ని మసీదులు, వాటి మత పెద్దల పూర్తి వివరాలను సంబంధిత శాఖలు సమర్పించాలని కోరారు.రంజాన్ మాసం సందర్భంగా ప్రజలు అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడంలో ఇబ్బందులు కలగకుండా దుకాణాలు ఎక్కువ సమయం తెరిచి ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ అధికారులకు సూచించారు.ప్రశాంతమైన వాతావరణంలో, సామరస్యంతో ప్రజలందరూ ఆనందంగా రంజాన్ పండుగను జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆకాంక్షించారు. ఈ సమావేశంలో మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి సంజీవరావు, కార్మిక శాఖ అధికారి షర్ఫుద్దీన్, పోలీస్ శాఖ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు,జిల్లా అదనపు వైద్య అధికారి, కొత్తగూడెం పాల్వంచ ఇల్లందు మణుగూరు మున్సిపల్ కమిషనర్లు, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ