తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పంటల వైవిధ్యీకరణతో రైతులకు భరోసా కల్పించాలి. ఎంఎస్పీపై అపోహలు తొలగించి రైతులకు పూర్తి అవగాహన కల్పించాలి.జిల్లాల్లో అత్యవసర కార్యాచరణ ప్రణాళికలు సిద్ధంగా ఉంచాలి.రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం కారణంగా వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు ఆదేశించారు.శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పంటల వైవిధ్యీకరణ, సంక్షేమ వసతి గృహాల నిర్వహణ, పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ తదితర అంశాలపై వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు, మార్కెట్ ధోరణులను దృష్టిలో ఉంచుకుని పంటల వైవిధ్యీకరణను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు జిల్లా, మండల, గ్రామ స్థాయిల వారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. గత కొన్ని రోజులుగా భారత వాతావరణ శాఖ అంచనాలు నిజమవుతున్నాయని, ప్రస్తుత పరిస్థితులు త్వరలో మెరుగుపడే అవకాశాలు తక్కువగా ఉన్నందున అధికారులు ఎలాంటి జాప్యం లేకుండా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రైతుల వద్దకు వెళ్లి వారి అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు పరిస్థితులకు అనుగుణంగా అవగాహన కల్పించాలని సూచించారు.కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై రైతుల్లో ఉన్న అపోహలను పూర్తిగా తొలగించాలని, దేశవ్యాప్తంగా దాదాపు 20 పంటలకు ఎంఎస్పీ అమలులో ఉందని వివరించాలని పేర్కొన్నారు. కేవలం వరికే మద్దతు ధర ఉంటుందనే భావన సరైంది కాదని, పత్తి సహా అనేక పంటలకు ఎంఎస్పీ వర్తిస్తుందని తెలిపారు. మార్కెట్ ధర ఎంఎస్పీ కంటే తగ్గినప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు స్పష్టంగా తెలియజేసి ప్రభుత్వంపై విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రత్యామ్నాయ పంటల సాగు వల్ల రైతుల ఆదాయం తగ్గుతుందనే అభిప్రాయం సరికాదని, అనేక సందర్భాల్లో మరింత అధిక ఆదాయం పొందే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ప్రాంతానికి అనువైన పంటల సాగుపై రైతులకు మార్గనిర్దేశం చేయాలని, సాగు విధానాల్లో అవసరమైన మార్పులు తీసుకురావాలని అధికారులకు సూచించారు.ప్రతి జిల్లాలో ఎల్నినో పరిస్థితులకు అనుగుణంగా అత్యవసర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసి వెంటనే అమలు చేయాలని, అవసరమైన విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ ఇన్పుట్లు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే రిజర్వాయర్లలో నీటి నిల్వలను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.జిల్లా ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు జిల్లాలో పంటల వైవిధ్యీకరణ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై విస్తృత అవగాహన కల్పించాలని, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై ఎలాంటి అపోహలు లేకుండా స్పష్టమైన సమాచారం అందించాలని తెలిపారు. అవసరమైన విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ ఇన్పుట్లు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తూ జిల్లాలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, మిషన్ భగీరథ ఈఈ నలిని, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ