తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనీస్ మాంజా విక్రయాలు,వాడకంపై కఠిన చర్యలు తీసుకొనబడుతాయని భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేశారు.పక్షుల స్వేచ్ఛకు,అమాయక వాహనదారుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్న ఈ ప్రమాదకరమైన మాంజాను ఎవరైనా రహస్యంగా విక్రయించినా,నిల్వ ఉంచినా ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు.నిబంధనలు అతిక్రమించిన వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.పండుగ పూట గాలిపటాలు ఎగురవేయడం సంప్రదాయమే అయినప్పటికీ,అది ఇతరుల ప్రాణాలకు ముప్పుగా మారకూడదన్నారు.చైనీస్ మాంజా పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తుందని తెలిపారు.ఇది మట్టిలో కలిసిపోక ఏళ్ల తరబడి అలాగే ఉండిపోతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 ప్రకారం ప్రభుత్వం చైనీస్ మాంజా తయారీ,విక్రయం,నిల్వ,వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించడం జరిగిందని సూచించారు.ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినామని తెలిపారు.భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా అన్ని గాలి పటాల విక్రయ కేంద్రాలు,చిన్న కిరాణా దుకాణాలు,అనుమానిత గోదాములపై CCS మరియు స్థానిక పోలీసులతో సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహిస్తామని అన్నారు.కేవలం విక్రయదారులే కాకుండా,ఇతర రాష్ట్రాల నుంచి భద్రాచలానికి అక్రమంగా ఈ నిషేధిత మాంజాను రవాణా చేస్తున్న ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు,పార్శిల్ సర్వీసులపైనా నిఘా పెంచామని,వారి ప్రమేయం ఉన్నట్లు తేలితే ఏజెన్సీ యజమానులపైనా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.చైనీస్ మాంజాలో ప్లాస్టిక్,ఇతర సింథటిక్ పదార్థాలతో పాటు గాజు పెంకుల మిశ్రమం పూతగా ఉంటుందని,దీని వల్ల ద్విచక్ర వాహనదారుల మెడలు తెగిపోవడంతో పాటు,పిల్లల వేళ్లు తెగిపోయే ప్రమాదం ఉందని అన్నారు.అంతేకాకుండా,ఇందులో ఉండే మెటాలిక్ పదార్థాల వల్ల విద్యుత్ తీగలకు తగిలినప్పుడు షాక్ కొట్టి పిల్లలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.పట్టణ పౌరులు కూడా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని పోలీస్ శాఖ తరపున విజ్ఞప్తి చేశారు.తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత చైనీస్ మాంజా విక్రయిస్తున్నట్లు లేదా నిల్వ చేసినట్లు గమనిస్తే వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి గానీ,ఏఎస్పీ కార్యాలయ ఫోన్ నంబరు 8712682104 కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ