తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియా పీవీకే-5 ఇంక్లైన్లో శుక్రవారం ఉదయం నిర్వహించిన మైన్స్ కమిటీ సమావేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, గని పరిసరాల్లో ఉన్న మౌలిక సదుపాయాల లోపాలు, భద్రతా అంశాలు మరియు కార్మిక సంక్షేమానికి సంబంధించిన విషయాలపై సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గుర్తింపు సంఘం (ఎఐటీయూసీ) నాయకులు యాజమాన్యంతో చర్చించారు. ఈ సమావేశానికి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటీయూసీ పిట్ కార్యదర్శి భూక్యా రమేష్ నాయకత్వం వహించారు. సమావేశంలో నాయకులు మాట్లాడుతూ సింగరేణి సంస్థ అభివృద్ధి, ఉత్పత్తి లక్ష్యాల సాధనలో కార్మికుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు తగిన సంక్షేమ సదుపాయాలు, పరిశుభ్రమైన వాతావరణం, భద్రతా ప్రమాణాలు మరియు మౌలిక సదుపాయాలు కల్పించడం యాజమాన్య బాధ్యత అని స్పష్టం చేశారు. కార్మికుడు ఆరోగ్యంగా, మానసికంగా ప్రశాంతంగా ఉంటేనే విధులకు క్రమం తప్పకుండా హాజరవుతూ సంస్థ ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తాడని తెలిపారు.గని పరిసరాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను మైన్స్ కమిటీ సభ్యులు, గని మేనేజర్తో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. మాన్వేకు వచ్చే దారిలో వర్షాకాలంలో నీరు నిలిచిపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందని గుర్తించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే డ్రైనేజీ మరియు నీటి మళ్లింపు చర్యలు చేపట్టాలని యాజమాన్యాన్ని కోరారు.అదేవిధంగా స్నానాల గదులు, కార్మికులు ఉపయోగించే సాధారణ ప్రదేశాల్లో ప్రతిరోజూ పరిశుభ్రత నిర్వహించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రత లోపిస్తే కార్మికుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని, అలాంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదని పేర్కొన్నారు.కార్మికుల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రతి కార్మికుడికి అండగా నిలిచి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని ఎఐటీయూసీ నాయకులు తెలిపారు. గనుల్లో పనిచేసే ప్రతి కార్మికుడి సంక్షేమం, భద్రత, ఆరోగ్యం విషయంలో యాజమాన్యం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో గని మేనేజర్ శ్యాంప్రసాద్, ఎస్ఓ అనిల్ సాగర్, ఎల్హెచ్డీ మరియు కామన్ సెక్షన్ ఇంచార్జి శ్రవణ్, యాక్టింగ్ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటేష్, ఎఐటీయూసీ పిట్ కార్యదర్శి భూక్యా రమేష్, మైన్స్ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు, సందీప్, సుమన్, సురేందర్ రెడ్డి, దేవుసింగ్, కె. రాంచందర్, శశివర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ