తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బక్కచింతలపాడు గ్రామంలో చర్ల పోలీసుల ఆధ్వర్యంలో నిర్మించిన నూతన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రారంభించారు. పాఠశాలలోని విద్యార్థిని,విద్యార్థులకు స్కూల్ బ్యాగులను, పలకలను పంపిణీ చేయడం జరిగింది. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులతో సమావేశమై పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విద్య అనేది ప్రతి చిన్నారి భవిష్యత్తుకు బలమైన పునాది అని పేర్కొన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లోని చిన్నారులు కూడా నాణ్యమైన విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పాఠశాలలో పరిశుభ్రమైన వాతావరణం, క్రమశిక్షణ, విద్యార్థుల నైతిక విలువలు, హాజరు శాతం పెంపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి విద్యార్థి ప్రతిభను గుర్తించి వారికి తగిన ప్రోత్సాహం అందించాలని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, యోగా, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని, వీటి ద్వారా ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జట్టు భావన పెంపొందుతాయని చెప్పారు. అనారోగ్యం, ప్రమాదాలు లేదా ఇతర సమస్యలు ఎదురైనప్పుడు మూఢనమ్మకాలను నమ్మకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించాలని తెలిపారు. ఆరోగ్య సమస్యలకు వైద్య చికిత్సే సరైన మార్గమని వివరించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచనలు చేశారు. డెంగీ, మలేరియా వంటి వర్షాకాల వ్యాధుల లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని తెలిపారు. గ్రామాల్లో నిర్వహించే వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, పిల్లలకు అవసరమైన టీకాలు పూర్తిగా వేయించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సూచనలు చేశారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా పాఠశాల ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం డిఎస్పి అరుణ్ కుమార్, ఎస్బి 2 ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, చర్ల సీఐ రాజు వర్మ, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ, యంఈఓ రమణ, కాంట్రాక్టర్ సంతోష్, సర్పంచ్ లక్ష్మి, ఉపాధ్యాయురాలు సౌజన్య, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ