తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా— గ్రాంపంచాయతీ ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల వ్యయాల పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడానికి నియమితులైన ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ లావణ్య సోమవారం పెంట్లం ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె ఎస్.ఎస్.టీ., ఎఫ్.ఎస్.టీ. బృందాలు చురుకుగా పనిచేయాలని, అక్రమ రవాణా, నగదు పంపిణీ, విలువైన వస్తువుల తరలింపులను కట్టడి చేసి, ప్రతీ తనిఖీని తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే ఏ చర్యలనైనా తక్షణమే నివేదించాలని ఆమె స్పష్టం చేశారు. అనంతరం చంద్రుగొండ మండల కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని, పోటీ అభ్యర్థులు మరియు ఎన్నికల సంబంధిత బృందాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల అబ్జర్వర్ మాట్లాడుతూ, ఎన్నికల వ్యయాల పట్ల పూర్తి పారదర్శకత పాటించాలని, ఖర్చుల నిర్వహణలో ఎటువంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఎన్నికల వ్యయాల పత్రాలను విధి విధానాలకు అనుగుణంగా నిర్వహించి, నిర్దిష్ట సమయానికి సమర్పించాలని సూచించారు. సమీక్షా సమావేశంలో జిల్లా వ్యయ నోడల్ అధికారి, మండల ప్రత్యేక బృందాలు, పరిశీలన అధికారులు, పోటీ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ