తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో సాయంత్రం 5:15 గంటలకు జూలూరుపాడు గ్రామంలోని శ్రీ గోపీకృష్ణ నర్సరీ ఎదుట, కొత్తగూడెం–ఖమ్మం బి.టి. రోడ్డుపై పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీలలో డ్రై గంజాయి స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో OD 10 H 4342 నంబరు గల మహీంద్రా జైలో (Mahindra XYLO) వాహనాన్ని పరిశీలించగా, అందులో ప్రయాణిస్తున్న వికాస్ మండల్ (46), త్రినాథ్ బిసోయి మరియు గణేష్ ముదులి (21) అనే ముగ్గురు వ్యక్తుల వద్ద 100 గ్రాముల చొప్పున మూడు (03) ప్యాకెట్ల డ్రై గంజాయి లభ్యమైంది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.5,000/గా అంచనా వేయబడింది. నిందితుల వద్ద నుండి డ్రై గంజాయిని పంచసాక్షుల సమక్షంలో చట్టబద్ధంగా స్వాధీనం చేసుకుని సీజ్ పంచనామా నిర్వహించారు. అనంతరం నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం (NDPS Act) సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై జీనత్ కుమార్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ మరియు వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని, ప్రజలు మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఏదైనా తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేసి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ