తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలంలో సీతారామ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ భూ సర్వే పనుల పరిశీలన పడమటి నరసాపురం గిరిజన బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్కు సంబంధించిన భూ సేకరణ సర్వే పనులను ప్రత్యేక యాక్షన్ ప్లాన్తో వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులో ముగించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం, మెరుగైన వసతి, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం జూలూరుపాడు మండలంలో జరుగుతున్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్కు సంబంధించిన భూ సేకరణ సర్వే పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే పురోగతిపై రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి, సర్వేలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జూలూరుపాడు గ్రామ పరిధిలో మొత్తం 17 ఎకరాల 20 కుంటల భూమికి సర్వే చేపట్టాల్సి ఉందని, అందులో సుమారు 8 ఎకరాలు ఆర్ఓఎఫ్ఆర్ (ROFR) పట్టా భూములు ఉన్నాయని అధికారులు కలెక్టర్కు వివరించారు. అనంతరం కొత్తూరు గ్రామంలో కొనసాగుతున్న భూ సర్వే పనులను పరిశీలించిన కలెక్టర్, మొత్తం 337 ఎకరాల భూమికి సర్వే చేపట్టాల్సి ఉందని తెలుసుకుని, పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని ఆదేశించారు. భూ సర్వే ప్రక్రియలో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ప్రతి దశను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. సర్వేకు అవసరమైన మార్కింగ్ పనులను ఒక రోజులో పూర్తి చేసి తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ వెడల్పును 50 మీటర్ల నుంచి 40 మీటర్లకు తగ్గించాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ప్రాజెక్టు డిజైన్ను సాంకేతికంగా పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ జూలూరుపాడు మండలం పడమటి నరసాపురం గ్రామంలోని గిరిజన బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ, తరగతి గదులు, వంటశాల, విద్యార్థుల వసతి గదులు, పారిశుధ్య నిర్వహణను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై సమగ్రంగా ఆరా తీశారు. విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉంచిన ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించిన కలెక్టర్, కిచెన్ షెడ్లో పరిశుభ్రత ప్రమాణాలను తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన కలెక్టర్, ఉదయం అల్పాహారం, మెనూ ప్రకారం భోజనం అందుతున్న విధానం, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీ, వసతి సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత విద్యా సంవత్సరంలో పాఠశాలలో పదో తరగతి ఫలితాలు వంద శాతం నమోదయ్యాయని ఉపాధ్యాయులు కలెక్టర్కు వివరించారు. ఈ విద్యా సంవత్సరంలో కూడా వంద శాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పాఠశాలల్లో పరిశుభ్రత, నాణ్యమైన ఆహారం, మెరుగైన విద్యా వాతావరణం, అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు నిరంతరం అందుబాటులో ఉండేలా అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన ప్రతి అంశాన్ని బాధ్యతగా తీసుకుని, లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట తాసిల్దార్ శ్రీనివాస్, ఇరిగేషన్ శాఖ అధికారులు, సర్వే అధికారులు, రైతులు, ఉపాధ్యాయులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ