తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : ములకలపల్లిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం ములకలపల్లి మండలంలో పర్యటించి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంతో పాటు ములకలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికి వెళ్లి ఎస్ఐఆర్ ఫారాలు పంపిణీ చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ప్రతి ఓటరికి ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని బీఎల్వోలకు సూచించారు. ఫారాల పంపిణీ సందర్భంగా ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లే సమయంలో ప్రతి కుటుంబాన్ని తప్పనిసరిగా కలుసుకుని అవసరమైన వివరాలను నమోదు చేయాలని, ఏ ఒక్క అర్హుడూ మిగిలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఓటరు జాబితా సవరణను పూర్తిస్థాయి పారదర్శకతతో, భారత ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రతి దరఖాస్తును నిబంధనల మేరకు పరిశీలించి అర్హులైన వారి పేర్లు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలు కూడా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని తమ వివరాలను పరిశీలించుకుని అవసరమైన ఫారాలను గడువులోపు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ములకలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, రోగులకు అందిస్తున్న చికిత్స విధానాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇన్పేషెంట్ వార్డు, ఔట్పేషెంట్ వార్డు, ప్రసూతి గది, రక్త పరీక్షల గది, ఫార్మసీ, ఔషధ నిల్వ కేంద్రం, ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి రోజువారీగా వచ్చే ఔట్పేషెంట్ల సంఖ్య, చికిత్స పొందుతున్న ఇన్పేషెంట్ల సంఖ్య, నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, ఇతర నిర్ధారణ పరీక్షల వివరాలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయా, ఔషధ నిల్వలు ఎంత మేరకు ఉన్నాయో పరిశీలించారు. అవసరమైన మందులు, పరీక్షా సామగ్రి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించి వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు, నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నివారణకు అవసరమైన మందులు, పరీక్షా కిట్లు, వైద్య సామగ్రిని తగినంతగా నిల్వ ఉంచాలని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ప్రజలకు సీజనల్ వ్యాధుల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ చర్యలు, సురక్షితమైన తాగునీటి వినియోగంపై విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణం, వార్డులు, పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట తహసీల్దార్ స్వాతి బిందు, డిప్యూటీ తహసీల్దార్ భాగ్యలక్ష్మి, వైద్యాధికారి డాక్టర్ సాయి కళ్యాణ్, హెల్త్ సూపర్వైజర్ శ్రీకృష్ణ, మెడికల్ సిబ్బంది ఇమ్రాన్, బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ