తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : టేకులపల్లి మండలం జిల్లా కలెక్టర్ విస్తృత పర్యటన పీఏసీఎస్ ఎరువుల గిడ్డంగులు, ఎస్ఐఆర్ కార్యక్రమం, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాల ఆకస్మికంగా తనిఖీ. టేకులపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం విస్తృతంగా పర్యటించి బొమ్మనపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) ఎరువుల గిడ్డంగులు, విక్రయ కేంద్రాలు, 9వ మైలు తండాలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం, టేకులపల్లి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ), జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.బొమ్మనపల్లి గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం బేతంపూడి ఎరువుల గిడ్డంగులు, విక్రయ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ గిడ్డంగుల్లో నిల్వ ఉన్న యూరియా, ఇతర ఎరువుల స్టాక్ను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్లో నమోదైన వివరాలకు అనుగుణంగా నిల్వలు ఉన్నాయా లేదా అని తనిఖీ చేసి, ఇప్పటివరకు ఎన్ని ఎరువుల బస్తాలు వచ్చాయి, ఎన్ని రైతులకు పంపిణీ చేశారు, ప్రస్తుతం ఎంత నిల్వ ఉంది, ఇంకా ఎంత పరిమాణంలో ఎరువులు రావాల్సి ఉందనే వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.యూరియా బుకింగ్ యాప్ పనితీరును రైతుల మొబైల్ ఫోన్లలో స్వయంగా పరిశీలించారు. యాప్ ద్వారా యూరియాను ముందస్తుగా బుక్ చేసుకునే విధానాన్ని రైతులకు వివరించి, జిల్లాతో పాటు మండలంలో అందుబాటులో ఉన్న యూరియా నిల్వల వివరాలను కూడా యాప్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. ఎరువుల పంపిణీలో పారదర్శకతను పెంపొందించడంతో పాటు ఎరువులు పక్కదారి పట్టకుండా నిరోధించడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు . యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించి, వినియోగించాలని సూచించారు.అనంతరం టేకులపల్లి మండలం 9వ మైలు తండాలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, నమోదు ప్రక్రియను క్షుణ్ణంగా తనిఖీ చేసి, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పూర్తిస్థాయి పారదర్శకతతో కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బూత్ లెవల్ అధికారులు అర్హులైన ప్రతి ఓటరిని గుర్తించి ఎన్యూమరేషన్ ఫారాల సేకరణను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. మరణించిన ఓటర్ల వివరాలను పూర్తిగా ధృవీకరించి నిబంధనల మేరకు ఓటరు జాబితా నుంచి తొలగించాలని, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాలను కూడా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అనంతరం టేకులపల్లి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ, కిచెన్ షెడ్, వంటశాల, పరిశుభ్రత, భోజన ఏర్పాట్లు, విద్యార్థినులకు అందిస్తున్న పోషకాహారాన్ని పరిశీలించారు. ఆర్వో ప్లాంట్ పనిచేయకపోవడంపై మండల విద్యాశాఖ అధికారిని ప్రశ్నించి, వెంటనే మరమ్మతులు పూర్తి చేసి విద్యార్థినులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. తొమ్మిదో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థినులతో మాట్లాడి విద్యా సౌకర్యాలు, హాస్టల్ వసతులు, హాజరు, నూతన ప్రవేశాలు, అభ్యాస స్థాయి, ఉత్తీర్ణత శాతం, యూనిఫాంల పంపిణీ తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. కంప్యూటర్ ల్యాబ్లను పరిశీలించి అందుబాటులో ఉన్న పరికరాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ విద్యార్థినులకు నాణ్యమైన ప్రాయోగిక విద్య అందించాలని అధ్యాపకులకు సూచించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో, పారదర్శకంగా అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, యూరియా బుకింగ్ యాప్ను రైతులు సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం కల్పిస్తున్న సేవలను వినియోగించుకోవాలని సూచించారు. యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా వినియోగంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అలాగే ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించి, అర్హులైన ప్రతి ఓటరికి నమోదు అవకాశం కల్పించాలని అన్నారు . బీఎల్వోలు అందజేసిన ఎన్యూమరేషన్ ఫారాలను ప్రజలు పూర్తిగా పూరించి నిర్ణీత గడువులోగా సమర్పించాలని సూచించారు. పాఠశాలల్లో ప్రతి విద్యార్థినికి నాణ్యమైన విద్యతో పాటు పరిశుభ్రమైన, సురక్షితమైన విద్యా వాతావరణం కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం పోషకాహారం, స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన హాస్టల్ వసతులు, అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు విద్యార్థినుల అభ్యాస సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు హాజరు, ఉత్తీర్ణత శాతాన్ని మెరుగుపరిచేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, ప్రతి విద్యార్థిని ఉన్నత లక్ష్యాలను సాధించేలా ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట తాసిల్దార్ వీరభద్రం, మండల విద్యాశాఖ అధికారి జగన్, వ్యవసాయ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ