తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం, మనుబోతులపాడు గ్రామపంచాయతీ పరిధిలో ఆదివాసీ మహిళలతో ఫారెస్ట్ అధికారులు దురుసుగా ప్రవర్తించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. వెంకన్న నాయక్ పేర్కొన్నారు. ఆదివాసీ మహిళల గౌరవం, భద్రత, రాజ్యాంగబద్ధ హక్కులు మరియు ప్రజాస్వామ్య విలువలపై జరిగిన ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి మహిళ గౌరవప్రదంగా జీవించే హక్కు కలిగి ఉందని, ముఖ్యంగా ఆదివాసీ మహిళల పట్ల అధికార యంత్రాంగం అత్యంత సున్నితంగా, మానవీయంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు.ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే నిష్పక్షపాత విచారణ చేపట్టి, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. విచారణలో అధికార దుర్వినియోగం జరిగినట్లు తేలితే, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.మహిళల గౌరవాన్ని, ఆదివాసీల హక్కులను కాపాడటం ప్రభుత్వ యంత్రాంగం యొక్క రాజ్యాంగబద్ధ బాధ్యత అని పేర్కొన్న ఆయన, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థే ప్రజల్లో భయాందోళనలు సృష్టించే పరిస్థితి రావడం అత్యంత విచారకరమని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ అంశాన్ని నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ గారి దృష్టికి తీసుకెళ్లి, బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా భారతీయ జనతా పార్టీ పోరాటం కొనసాగిస్తుందని డా. వెంకన్న నాయక్ ఈ సందర్భంగా తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ