తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఓటు హక్కుపై సిపిఐ విస్తృత ప్రచారం ఎస్ఐఆర్ ప్రక్రియపై గడపగడపకూ అవగాహన ఓటర్ జాబితా సవరణపై సిపిఐ ఆటో ప్రచారం ఎస్ఐఆర్ ఫారం అందించకుంటే జరిగే నష్టంపై అవగాహన ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో విస్తృత ప్రచార కార్యక్రమం చేపట్టినట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా తెలిపారు. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన బస్తీలు, గ్రామాల్లో ఐదు ప్రచార ఆటోల ద్వారా ఈ మైకు ప్రచారాన్ని రెండో రోజైన గురువారం అయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, ఓటర్ల నమోదు ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో హక్కును కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఎన్యుమరేషన్ ఫారాలను సరైన వివరాలతో నింపి తిరిగి ఎన్నికల అధికారులకు అందించే బాధ్యతను ప్రతి పౌరుడు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫారాలను సరిగా సమర్పించకుంటే ఎదురయ్యే నష్టాలను, ప్రక్రియ షెడ్యూల్ విశేషాలను మైకుల ద్వారా వీధి వీధినా ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు. ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందన్నారు. స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ప్రాతినిధ్యంలో నియోజకవర్గంలో అన్ని రంగాల్లోనూ శీఘ్రగతిన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్లు, డ్రెయిన్లు, వంతెనల నిర్మాణం, సంక్షేమ పథకాలు, నిధుల సేకరణ ద్వారా నియోజకవర్గాన్ని మోడల్గా తీర్చిదిద్దేందుకు కృషి జరుగుతోందన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం, ఓటు హక్కు నమోదు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు నియోజకవర్గ వ్యాప్తంగా తమ పార్టీ ప్రచారాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ