తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని, ఇందులో భాగంగా డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, సంబంధిత అధికారులతో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ జూన్ 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభించామని, ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ తుది దశకు చేరుకుందని తెలిపారు. పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను ఓటర్లు పూర్తి చేసి తిరిగి అందించిన వెంటనే సంబంధిత బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) యాప్లో డిజిటైజేషన్ చేపట్టాలని సూచించారు. ఎన్యుమరేషన్ ఫారాల్లో వివరాల నమోదుకు వాలంటీర్ల సేవలను వినియోగించుకుని ఓటర్లకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. డిజిటైజేషన్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. అనంతరం పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ చేపట్టి, ప్రతి పోలింగ్ కేంద్రంలో నిర్దేశిత పరిమితికి మించి ఓటర్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో తప్పుడు సమాచారం సమర్పించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిజిటైజేషన్ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులకు సూపర్వైజర్లు, వాలంటీర్లు పూర్తి సహకారం అందించాలని ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్కు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ను నిబంధనలకు అనుగుణంగా పకడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తూ కార్యక్రమ పురోగతిని సమీక్షిస్తున్నామని, జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ సమావేశం లో సంబంధిత శాఖ ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ