తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కరకగూడెం పోలీసుల ఆధ్వర్యంలో గిరిజన గ్రామాల్లో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్కు చెందిన రాబిన్ హుడ్ స్వచ్ఛంద సంస్థ తరఫున నీలాద్రిపేట, గండి, అశ్వాపురంపాడు, గుత్తికోయ గ్రామాల్లోని గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులతో , చీరలు, సోలార్ విద్యుత్ లైట్లు, మహిళా అవసర వస్తువులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన సహాయం అందించేందుకు పోలీస్ శాఖ తరఫున సహకారం అందిస్తామని తెలిపారు. గిరిజన గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.అనంతరం గ్రామస్తులకు మద్యపానం, ఇతర దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. పిల్లలను తప్పనిసరిగా పాఠశాలకు పంపించి వారి విద్యను కొనసాగించేలా తల్లిదండ్రులు సహకరించాలని అవగాహన కల్పించారు. గ్రామాల్లో శాంతి, సామరస్య వాతావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏడుల్లా బయ్యారం సీఐ వి. వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్సై పి.వి.ఎన్. రావు, రాబిన్ హుడ్ స్వచ్ఛంద సంస్థ సేవకులు భూసారపు రమేష్, పోలీస్ సిబ్బంది, సభ్యులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ