తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్టమైన బందోబస్తు చేపట్టాలి.. భారీ వర్షాలు, వరదలు పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.. అత్యవసరమైతే తప్ప వైద్య శాఖ సిబ్బంది సెలవులు రద్దు.. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించాలి... వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్రమోహన్ ఐఏఎస్. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సురేంద్ర మోహన్ ఐఏఎస్ శనివారం హైదరాబాదు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో భారీ వర్షాలు వరదలు, యూరియా నిల్వలు, సీజనల్ వ్యాధులు పట్ల ముందస్తు జాగ్రత్తలు మరియు రేషన్ కార్డులు మంజూరు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ మరియు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేందర్ మోహన్ ఐఏఎస్ మాట్లాడుతూ... జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు మరియు గోదావరి వరదల పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. భారీ వర్షాలు వరదల పట్ల ఏ ఒక్క ప్రాణ హాని జరగకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసర సమయంలో ఎన్డీఆర్ఎఫ్ ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు. ఆపదమిత్ర వాలంటీర్లు అందుబాటులో విధంగా చర్యలు చేపట్టాలన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ను పటిష్టంగా అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో యూరియా కు సంబంధించి రెండు లక్షల టన్నుల దిగుమతి తగ్గిందని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి తగినంత యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 65 వేల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు గత సంవత్సరం కంటే అదనంగా కొనుగోలు చేశారని, దానికి కారణం యూరియా దొరకదు అనే భయంతో పాటుగా యూరియా నిల్వలపై ఉన్న తప్పుడు సమాచారం ద్వారానే అని ఆయన అన్నారు. జిల్లాలో వ్యవసాయ మార్కెటింగ్ మరియు రవాణా అధికారులు యూరియా అక్రమ రవాణాను అరికట్టాలని అక్రమ రవాణా పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో అంతర్రాష్ట్ర సరిహద్దులు వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. యూరియా నిల్వలు దారి మళ్లించి కొన్ని పరిశ్రమలు చట్ట వ్యతిరేకంగా వినియోగిస్తున్నాయని అన్నారు. రైస్ మిల్లులు, యాడ్ బ్లూ, సోలార్ కనెక్షన్, లిక్కర్, పాడి తదితర పరిశ్రమలలో యూరియాను చట్ట వ్యతిరేకంగా వినియోగిస్తున్నారని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వరావుపేటలో ఐదు యాడ్ బ్లూ పరిశ్రమలు ఈ యూరియాను వినియోగిస్తున్నట్లు గుర్తించామని ఆయన తెలిపారు. వాటిపై తగిన పరిశీలన జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి మారుమూల గిరిజన ప్రాంతాల్లో వర్షాకాలం సమయంలో వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టే విధంగా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైనన్ని మందుల నిల్వలు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలని అత్యవసరమే సమయాల్లో తప్ప సాధారణ సెలవులు రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మందుల కొరత, సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్ల ఏ ఒక్క ప్రాణహాని జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను మంజూరు అయ్యేలా తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన అధికారులకు ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ... జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని తెలియజేశారు. గోదావరిలో ప్రస్తుతం 33 అడుగులు ఉందన్నారు. గోదావరి వరదలు ముందస్తు జాగ్రత్తలో భాగంగా జిల్లాలో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఒకటి భద్రాచలం రెండవది పాల్వంచలో అందుబాటులో ఉంచినట్టు ఆయన వివరించారు. కొత్తగూడెం చాతకొండ ఎస్ డి ఆర్ ఎఫ్ లో 100 మంది కానిస్టేబుల్ కు అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవలసిన చర్యలపై శిక్షణ పొందినట్లు తెలిపారు. వారు వివిధ ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించారన్నారు. ఆపద మిత్ర వాలంటీర్ల కోసం అగ్నిమాపక శాఖ సమన్వయంతో భద్రాచలం మరియు పాల్వంచలో మీటింగ్ నిర్వహిస్తామన్నారు. అత్యవసర సమయంలో అవసరానికి అనుగుణంగా ఏడు బోట్లు, మైకులు, రోప్ మరియు టార్చ్ లైట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. భద్రాచలం కరకట్ట పైన సైరన్ ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో మూడు వేల మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉందని, ఖమ్మం నుంచి యూరియా రావాల్సి ఉన్నదని వర్షం వలన ఆలస్యమైందని ఆయన తెలిపారు. జిల్లాలోని రైతులకు అందరికీ తెలియజేశామని వారి యొక్క ఫోన్ నెంబర్లు తీసుకుని యూరియా రాగానే అందిస్తామని తెలియజేశామని వివరించారు. జిల్లాలో నానో యూరియా పై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలోని అశ్వరావుపేటలో గుర్తించినటువంటి ఐదు యాడ్ బ్లూ పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామని, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి యూరియా అక్రమ రవాణాను అడ్డుకుంటామని కలెక్టర్ తెలిపారు. సీజనల్ వ్యాధులు పట్ల ముందస్తు చర్యల లో భాగంగా అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, ఇటీవల ఇన్సులిన్ కొరత ఉన్నప్పటికీ ప్రస్తుతం అవి కూడా అందుబాటులోకి వచ్చాయని తెలియజేశారు. వైద్య శాఖ సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని అత్యవసర సమయంలో తప్ప సాధారణ సెలవులు రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. అవసరమైనటువంటి రాపిడ్ టెస్ట్ కిట్లు అన్ని అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. జిల్లావ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల మంజూరు పూర్తి అయినప్పటికీ ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులు రాష్ట్రస్థాయిలో పెండింగ్లో ఉన్నాయని జిల్లా ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లా వ్యాప్తంగా 13,844 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా 7747 ఇండ్లు గ్రౌండ్ పూర్తి పూర్తి చేసుకున్నామని, మిగిలిన వాటిని కూడా గ్రౌండింగ్ పూర్తి చేసేందుకు తగిన చర్యలు చేపట్టామన్నారు. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇండ్లకు నిధులు జమ చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రిజర్వాయర్లు నీటి నిల్వలు అనుకూలంగా ఉన్నాయని, ఈసారి సీజన్లో రెండున్నర లక్ష ఎకరాలకు సాగునీరు విడుదల చేయడానికి అవకాశం ఉందన్నారు. అత్యవసరమైన పరిస్థితుల్లో అవసరమైన ఇసుక బస్తాలను అందుబాటులో ఉంచినట్టు వివరించారు. వనమహోత్సవంలో భాగంగా జిల్లాలో 70.65 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం కాగా ఇప్పటికే 35 లక్షల మొక్కలను నాటినట్లు తెలియజేశారు. ఈత చెట్లు 1.35 లక్షలు, తాటి చెట్లు26 వేలు కాగా ఇప్పటికే 41 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు ఆగస్టు 15 నాటికి వనమహోత్సవ లక్షణాలను పూర్తి చేస్తామని తెలియజేశారు. జిల్లావ్యాప్తంగా 2192 పాఠశాలలో గుడ్ల సరఫరా కోసం ఈనెల 28న పేపర్ నోటిఫికేషన్ ఇస్తామని ఆగస్టు 6న టెండర్లను ఓపెన్ చేస్తామని టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని ఈ సందర్భంగా జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్రమోహన్ కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, సిపిఓ సంజీవరావు, హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, పౌరసరఫరాల శాఖ అధికారి రుక్మిణి, వైద్య శాఖ అధికారి జయలక్ష్మి, ఇరిగేషన్ ఎస్ ఈ రవికుమార్, ఈ ఈ అర్జున్ రావు మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ