తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పంట సాగులో వర్షపాతం, విత్తనాల లభ్యతపై ప్రత్యేక దృష్టి – ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు .విత్తనాలు, ఎరువులు రైతులకు సకాలంలో అందేలా చర్యలు. నకిలీ విత్తనాలపై కఠిన నిఘా కొనసాగించాలి.త్రాగునీటి పనులు, సీజనల్ వ్యాధుల నియంత్రణపై అప్రమత్తంగా ఉండాలి రాష్ట్రంలో వానాకాలం-2026 వ్యవసాయ సాగు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదు, త్రాగునీటి సరఫరా, సీజనల్ వ్యాధుల నివారణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో లోటు వర్షపాతం నమోదైన నేపథ్యంలో రైతులకు పంటల మార్పిడి విధానాలు, ప్రత్యామ్నాయ సాగు పద్ధతులపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. వానాకాలం సాగుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయని, రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాల వారీగా విత్తనాల నిల్వలు, పంపిణీని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి కొరత తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.వానాకాలం-2026లో 138.49 లక్షల ఎకరాల్లో పంటల సాగు లక్ష్యంగా నిర్ణయించగా, అవసరమైన 19.68 లక్షల క్వింటాళ్ల విత్తనాలకు గాను 74.44 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, ఇప్పటివరకు 530.43 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకుని, సుమారు రూ.3.98 కోట్ల విలువైన విత్తనాలను సీజ్ చేయడంతో పాటు 73 మందిని అరెస్టు చేసి, 39 క్రిమినల్ కేసులు, 2 పీడీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు వివరించారు. విత్తన విక్రయ కేంద్రాలు, ప్రాసెసింగ్ యూనిట్లు, సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.రాష్ట్రంలో ప్రస్తుతం 5 జిల్లాల్లో సాధారణ, 27 జిల్లాల్లో లోటు, ఒక జిల్లాలో తీవ్ర లోటు వర్షపాతం నమోదైందని, మండలాల వారీగా 36 మండలాల్లో అధిక, 142 మండలాల్లో సాధారణ, 358 మండలాల్లో లోటు, 85 మండలాల్లో తీవ్ర లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు సాంకేతిక సూచనలు అందించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, ప్రీ-ప్రైమరీ విభాగాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, తెలంగాణ మోడల్ స్కూళ్లలో 2026–27 విద్యా సంవత్సరానికి విద్యార్థుల నమోదు లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. జిల్లాల కలెక్టర్లు ప్రతిరోజూ పాఠశాలల వారీగా నమోదును సమీక్షిస్తూ ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని తెలిపారు. ప్రీ-ప్రైమరీ విభాగాలకు అవసరమైన బోధకులు, ఫర్నిచర్, బోధన సామగ్రి, యూడైస్ నవీకరణ, ప్రవేశాల నమోదు తదితర ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రుల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంపొందించాలని సూచించారు.రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని, కేంద్రీకృత వంటశాలలను సెప్టెంబర్ 30లోపు పూర్తి చేసి విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అమృత్ 2.0 పథకం కింద చేపడుతున్న త్రాగునీటి పైప్లైన్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు, పంపిణీ వ్యవస్థల పనులను వేగవంతం చేయాలని, గ్రామాలు, పట్టణాల్లో త్రాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు.వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ప్రతి శుక్రవారం "డ్రై డే" నిర్వహిస్తూ దోమల నివారణ, ఫాగింగ్, లార్వా నిర్మూలన, పారిశుద్ధ్య కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. గర్భిణుల ఆరోగ్య సంరక్షణ, ఆసుపత్రుల్లో మందులు, పరీక్షా కిట్లు, రక్త నిల్వలు, అంబులెన్స్ సేవలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కాన్ఫరెన్స్ లో ఐడిఓసి కార్యాలయం సమావేశం మందిరం నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వానాకాలం వ్యవసాయ సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచామని, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. రైతు నమోదు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. త్రాగునీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి విద్యాచందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్, జిల్లా పంచాయతీ అధికారి అనూష, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్, నలిని సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ