తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం విస్తృతంగా పర్యటించి పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రి, ప్రతిపాదిత యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల స్థలాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్య, వైద్యం, మౌలిక వసతులపై సమగ్రంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. మొదటగా తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్, విద్యార్థులకు వడ్డించడానికి సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించి వాటి నాణ్యతను సమీక్షించారు. డైనింగ్ హాల్, స్టోర్ రూమ్ నిర్వహణను పరిశీలించి, నిల్వ ఉంచిన బెల్లం నాణ్యతపై సందేహం వ్యక్తం చేస్తూ సరఫరా వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే చింతపండు, కూరగాయల నాణ్యతను కూడా పరిశీలించి ఎల్లప్పుడూ తాజా, నాణ్యమైన ఆహారం మాత్రమే విద్యార్థులకు అందించాలని ఆదేశించారు. విద్యార్థులకు వడ్డించే ఆహారాన్ని ముందుగా పూర్తిగా పరిశీలించిన తర్వాతే అందించాలని, ఇందుకు 8,9,10 వ తరగతి విద్యార్థులను కూడా ఆహార పరిశీలనలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. మెనూ ప్రకారం పోషకాహారం అందించడంతో పాటు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని స్పష్టం చేశారు. తరగతి గదిలో 6 వ, 7వ తరగతి విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, చికెన్ ఎన్ని సార్లు పెడుతున్నారు,ఆహార నాణ్యత, ఇతర సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారం ఆహారం అందుతున్నదా అనే విషయంపై సిబ్బందిని ప్రశ్నించారు. గ్యాస్ సరఫరా, వంటశాల నిర్వహణ, పరిశుభ్రతపై వివరాలు తెలుసుకొని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సరిపడా నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. జిల్లాలో మెనూ పాటించని పరిస్థితులు తమ దృష్టికి వచ్చిందని అలాంటివి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. అనంతరం అశ్వరావుపేట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్, ఔట్ పేషెంట్ విభాగం, వార్డులు, రక్త పరీక్ష కేంద్రం, మందుల నిల్వ గదులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, కొరత ఉంటే వెంటనే ఇండెంట్ చేయాలని సూచించారు ఆరోగ్యశ్రీ సేవల విభాగాన్ని పరిశీలించి అర్హులైన ప్రతి రోగికి సమయానికి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్కానింగ్, ఎక్స్-రే విభాగాలను పరిశీలించిన సందర్భంగా సేవల్లో ఆలస్యం జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రేడియాలజీ టెక్నీషియన్ల కొరత ఉన్నట్లు తెలుసుకొని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఇన్ పేషెంట్ వార్డుల్లో రోగులకు అందించే ఆహారాన్ని పరిశీలించి,ఆహారం తయారు చేసే ప్రదేశాన్ని తనిఖీ చేశారు. ప్రభుత్వం ప్రతి రోగికి ఆహారం కోసం ఎంత నిధులు చెల్లిస్తున్నారని కాంట్రాక్టర్ను అడగగా 80 రూపాయలు చెల్లిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం చెల్లించే నిధులకు అనుగుణంగా నాణ్యమైన ఆహారం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు అందించాల్సిన పోషకాహారంలో అరటిపండ్లు, గుడ్లు కనిపించకపోవడాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి వచ్చే పేదవారికి ఆరోగ్యకరమైన పోషక విలువలతో కూడిన ఆహారం అందించడం కోసమే ప్రభుత్వం ఈ భోజనాన్ని అందిస్తుందని దానికి అనుగుణంగా ప్రతి రోగికి నాణ్యమైన పరిశుభ్రమైన ఆహారం అందించడం అధికారుల బాధ్యత అన్నారు. వైద్యశాఖ అధికారులు రోగులకు అందించే ఆహారం పై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, స్థలం విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితులు, చేరువ మార్గాలు, మౌలిక వసతుల లభ్యత వంటి అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల నిర్మాణానికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించి పనులను త్వరితగతిన ప్రారంభించాలని ఆదేశించారు. ఈ తనిఖీలలో కలెక్టర్ వెంట తహసీల్దార్ కిషోర్, ఎంపీడీవో అప్పారావు, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, ఆర్ఎంఓ మౌనిక, ప్రధానోపాధ్యాయురాలు సంగీత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ