తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఐడిఓసి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ప్రజల నుండి వినతులు, ఫిర్యాదులను స్వీకరించి సమగ్రంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పద్మ, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి శ్రీరామ్ పాల్గొన్నారు. జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ వ్యక్తిగత, సామూహిక సమస్యలను అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని తెలిపారు. ప్రతి వినతిపత్రాన్ని బాధ్యతాయుతంగా పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వెంటనే పరిష్కరించగల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, మిగిలిన సమస్యలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజావాణిలో స్వీకరించిన కొన్ని దరఖాస్తులు : పాల్వంచ శేఖర్ బంజరకు చెందిన చెరుకుపల్లి పద్మ తాను గత 15 సంవత్సరాలుగా రేకుల గుడిసెలో నివసిస్తున్నానని, సొంత స్థలం ఉన్నప్పటికీ ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు మంజూరు కాలేదని పేర్కొంటూ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. దరఖాస్తును పరిశీలించిన అదనపు కలెక్టర్ తగు చర్యల నిమిత్తం గృహ నిర్మాణ శాఖ అధికారికి ఎండార్స్ చేశారు. ములకలపల్లి గ్రామానికి చెందిన గాదె మోహన్ రెడ్డి సర్వే నంబర్ 119లో 2 ఎకరాలు 17 గుంటల భూమికి పట్టాదారు పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు మంజూరు కాలేదని, దీంతో రైతుబంధు తదితర ప్రభుత్వ పథకాల లబ్ధి పొందలేకపోతున్నానని తెలిపారు. త్వరితగతిన పాస్ పుస్తకం మంజూరు చేయాలని కోరుతూ చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం సంబంధిత విభాగానికి ఎండార్స్ చేశారు. చుంచుపల్లి మండలానికి చెందిన మంగమ్మ ఆసరా పెన్షన్పై జీవనం సాగిస్తున్నానని, ప్రజాపాలన సభలో గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇంకా విద్యుత్ బిల్లులు వస్తున్నాయని పేర్కొంటూ ఉచిత విద్యుత్ మంజూరు చేయాలని కోరారు. దరఖాస్తును పరిశీలించిన అదనపు కలెక్టర్ తగు చర్యల నిమిత్తం విద్యుత్ శాఖ అధికారులకు ఎండార్స్ చేశారు. దమ్మపేట మండలం పట్వారిగూడెం గ్రామానికి చెందిన రాములు సర్వే నంబర్లు 413, 425, 439, 638/1లో వ్యవసాయ భూమి ఉన్నదని, ఆ భూములకు వారసత్వ పట్టా పాస్ పుస్తకాల కోసం దమ్మపేట తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు మంజూరు కాలేదని తెలిపారు. తమ తండ్రి నుండి వారసత్వంగా సంక్రమించిన భూములకు తమ పేర్లపై పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని కోరుతూ చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం దమ్మపేట తహసీల్దార్కు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ