తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అడ్వకేట్స్ యాక్ట్ కు సవరణ చేయటం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకు రానున్న ప్రతిపాదిత బిల్లును వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ న్యాయవదుల్లో విస్తృత ప్రచారం చేపట్టింది. ప్రతిపాదిత సవరణలతో బార్ కౌన్సిల్ స్వతంత్ర ప్రతిపత్తి ప్రశ్నార్ధకం అవుతుందని, న్యాయవాద వృత్తి మనుగడకు ప్రమాదకరంగా పరుణమిస్తుందని, ప్రస్తుత చట్టాన్నే కొనసాగించాలని, విదేశీ లాయర్లను అనుమతించొద్దని ఏ.ఐ.ఎల్.యు. నాయకులు డిమాండ్ చేశారు.ప్రచారంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ముసాయిదా బిల్లు ప్రతిపాదనలపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలతో కూడిన ఎనిమిది పేజీల వివరణాత్మక కరపత్రాన్ని ఏ.ఐ.ఎల్.యు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించి విడుదల చేసారు. జిల్లా వ్యాపితంగా న్యాయవాదులకు మంగళవారం నాడు కరపత్రాన్ని పంపిణీ చేశారు. కరపత్రంలో కొత్త ముసాయిదా బిల్లులోని లోపాలు, కేంద్ర ప్రభుత్వ ఏకపక్షవైఖరిని వివరించారు. ముసాయిదా బిల్లులో న్యాయవాదుల రక్షణ, సంక్షేమ చర్యలపై ఏమీ లేకపోగా, వృత్తిని ప్రమాదంలో పడేసే ప్రతిపాదనలు ఉన్నాయని తప్పుబట్టారు..ఎలాంటి చర్చలు, సంప్రదింపులు లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారం సవరించాలని చూస్తే, దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కొత్త బిల్లుపై ఇప్పటికే ఐలు పరిశీలనలు, ప్రతిపాదనలతో కూడిన వినతిపత్రాన్ని కేంద్రప్రభుత్వానికి పంపినట్టు తెలిపారు. కేవలం న్యాయవిద్య చదువుకున్న వారు మాత్రమే న్యాయవాద వృత్తిలోకి అనుమతించాలని, న్యాయవాదులు మాత్రమే బార్ కౌన్సిళ్లకు ప్రాతినిధ్యం వహించాలని ఏ.ఐ.ఎల్.యు. నాయకులు అభిప్రాయపడ్డారు. ఆయా రాష్ట్రాల బార్ కౌన్సిళ్లలోగానీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలోకి గాని కేంద్ర ప్రభుత్వం ముగ్గురు న్యాయవాదేతర వ్యక్తులను నియమించాలని చూడటం అప్రజాస్వామ్య విధానమని విమర్శించారు. కొత్త సవరణ చట్టం న్యాయవాదుల ఉనికిని దెబ్బతీసేవిధంగా ఉందని గుర్తు చేశారు. కొత్త ప్రతిపాదిత ముసాయిదాలో తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ పేరే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బార్ కౌన్సిళ్ల ఎన్నికలు ప్రజాస్వామ్య పద్దతిలో జరుగుతున్నాయని గుర్తు చేశారు. కేసులను ఎదుర్కొంటున్న న్యాయవాదులు ఆయా సందర్భాల్లో అనర్హతకు గురయ్యే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు. లౌకిక, ప్రజాస్వామ్య, స్వతంత్ర భారతదేశంలో న్యాయవాదులతో సంప్రదించకుండా కొత్త చట్టం తేకూడదని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని, న్యాయవాదులను కాపాడుకునేందుకు ఎంతవరకైనా వెళతామని స్పష్టం చేశారు. ప్రజలు, న్యాయవాదుల తరపున ఉద్యమాలు, పోరాటాలు చేయకుండా అడ్డుకోవడానికే కొత్త చట్టం ద్వారా నియంత్రించాలని కేంద్రం చూస్తున్నదని విమర్శించారు. సామాజిక ఉద్యమాల్లో న్యాయవాదులు పాల్గొనకుండా చూడాలనుకోవడం అవివేకమని చెప్పారు. బార్ కౌన్సిల్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలనుకోవడం కేంద్ర ప్రభుత్వ భ్రమ మాత్రమేనని వ్యాఖ్యానించారు. కొత్త సవరణ చట్టం ప్రతిపాదనల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీ న్యాయ వాదులకు రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనలేవీ లేవని గుర్తు చేశారు. ఇప్పటివరకు కౌన్సిళ్లు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయని, కొత్త సవరణ ముసాయిదా ఆ స్వతంత్రతను దెబ్బతీసేలా, వాటి స్వయం ప్రతిపత్తికే ప్రమాదం తెచ్చేలా ఉందని చెప్పారు. న్యాయవాదులు కాని వ్యక్తులను భారత బార్ కౌన్సిల్లో నియమించాలని చూస్తున్నదనీ, ఇది న్యాయవాదులను అవమానించడ మేగాక, కోర్టు అధికారాలను కించపరచడమే అవుతుందని చెప్పారు. ఆందోళన, నిరసనలు, ఉద్యమాలు చేయకుండా న్యాయవాదులను అణిచివేసే ప్రక్రియే కొత్త ముసాయిదా చట్టమని చెప్పారు. కొత్త బిల్లు ద్వారా న్యాయవాదులపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తు న్నదని చెప్పారు. గాంధేయ మార్గంలో ఆందోళన చేసినా వృత్తి నుంచి బయటకు పంపే ప్రయత్నం కేంద్రం చేస్తున్నదన్నారు. విదేశీ న్యాయవాదులను దేశంలోకి అనుమతించరాదనీ, వారిపై నియంత్రణ చేయడం సాధ్యం కాదన్నారు. విదేశీ న్యాయవాదులను దేశంలోకి అనుమతిస్తే భారత న్యాయవ్యవస్థను అవమానించడమే అవుతుందని చెప్పారు. న్యాయవాదులపై దాడుల నివారణకు ఎలాంటి ప్రతిపాదనలు కొత్త ముసాయిదాలో లేవని అభి ప్రాయ పడ్డారు. న్యాయవాదుల (సవరణ) బిల్లు-2025ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. కరపత్రాన్ని ఐలు నాయకులు ఎం.వి. ప్రసాదరావు, రమేష్ కుమార్ మక్కడ్, జె. శివరాం ప్రసాద్, కె.పుల్లయ్య, పి.కిషన్ రావు, పాయం రవివర్మ, బండారు అరుణ్, రావిలాల రామారావు, అరికాల రవి కుమార్, మెదరమెట్ల శ్రీనివాస రావు, యు.గౌతమ్ కుమార్ తదితరులు ఆవిష్కరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ