తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ధర్మేంద్ర ప్రధాన్'కు మరో శాఖా కేటాయించే ఆలోచన విరమించుకోవాలి.విద్యావ్యవస్థ ప్రక్షాళన తక్షణమే జరగాలి. విద్యార్థుల బలిదానాలకు పరిహారం ఇవ్వాలి.ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్, సీబీఎస్ఈ పరీక్షా పేపర్ల లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థుల ఐక్య పోరాట విజయమని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్ తెలిపారు. శనివారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ వివరాలు వెల్లడించారు. పేపర్ లీకేజీలకు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థి లోకం నిర్వహించిన పోరాటాల దాటికి తలవంచి కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదన్నారు. కేంద్ర విద్యాశాఖలోని నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడటమే కాకుండా, మనస్తాపంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం తీవ్ర విచారకరమన్నారు. లీకేజీ బాధ్యుడైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సరిపెట్టకుండా, ఆయనకు భవిష్యత్తులోనూ ఎలాంటి మంత్రిత్వ శాఖనూ కేటాయించకూడదని డిమాండ్ చేశారు. కల్తీ లేని విద్యావ్యవస్థను అందించేందుకు ప్రభుత్వం తక్షణమే ప్రక్షాళన చర్యలు చేపట్టాలని, ఈ అంశంపై పార్లమెంటు వేదికగా సుదీర్ఘ చర్చ జరగాలని కోరారు. నీట్ అక్రమాల వల్ల ప్రాణాలు కోల్పోయిన బాధిత విద్యార్థుల కుటుంబాలకు తక్షణమే రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తమ న్యాయమైన హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళనలు చేపట్టిన విద్యార్థులపై బనాయించిన అక్రమ కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు. పేపర్ లీకేజీల సంస్కృతిని అరికట్టేలా శాశ్వత పరిష్కారం చూపాలని, ఈ అక్రమాలపై ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన ఉద్యమాలు కొనసాగించామని గుర్తుచేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ