తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎల్-నినో ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసి నష్టాలను నివారించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు సూచించారు. బుధవారం లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమల్ల గ్రామంలో మండల వ్యవసాయ అధికారి దీపక్తో కలిసి నిర్వహించిన రైతుల అవగాహన సమావేశంలో ఆయన పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ, బోరు నీటిపై ఆధారపడి వరి సాగు చేయడం వల్ల నీటి కొరత ఏర్పడి దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ఆయిల్ పామ్, అపరాలు (పప్పుధాన్యాలు), కూరగాయలు, మొక్కజొన్న, జొన్న వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులకు దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం లభిస్తుందని, అపరాలు, మొక్కజొన్న, జొన్న వంటి పంటలు తక్కువ నీటితో సాగవడంతో పాటు మార్కెట్లో మంచి డిమాండ్ కలిగి ఉన్నాయని తెలిపారు. పంటల వైవిధ్యీకరణ ద్వారా భూసారాన్ని కాపాడుకోవడంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని కూడా తగ్గించుకోవచ్చన్నారు. ఎల్-నినో పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఎప్పటికప్పుడు సాంకేతిక సూచనలు అందిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. రైతులు వ్యవసాయ శాఖ సూచనలను పాటించి శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టి అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దీపక్, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ