తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తండ్రి కష్టాన్ని చూసి పెరిగిన ఆ బిడ్డలు, ఆయన పడ్డ శ్రమకు సార్థకత చేకూరుస్తున్నారు. సామాన్య కుటుంబం నుండి వచ్చినప్పటికీ, ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. చుంచుపల్లి మండలం ఎన్కే నగర్ భాధావత్ తండా గ్రామానికి చెందిన,భూక్యా రవి, సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తు , టీజీపీఎస్సీ (TGPSC) ఫలితాల్లో సీనియర్ ఆడిటర్ ఉద్యోగాన్ని సాధించి తన సత్తా చాటారు. తండ్రి కష్టమే వారి విజయానికి పునాది రవి తండ్రి భూక్యా జగన్ తన పిల్లల చదువు కోసం ఎంతో కష్టపడ్డారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో కూడా పిల్లల విద్య విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదు. తన పిల్లలు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండాలని ఆయన పడ్డ తపన నేడు ఫలించింది. ఒకే ఇంట్లో ఇద్దరు ఉన్నతాధికారులు జగన్ ఇద్దరు కుమారులు ప్రస్తుతం ఉన్నత హోదాల్లో ఉండి తండ్రి పేరు నిలబెడుతున్నారు. పెద్ద కుమారుడు రవి ప్రస్తుతం సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2గా పని చేస్తూనే, పట్టుదలతో చదివి ఇప్పుడు టీజీపీఎస్సీ సీనియర్ ఆడిటర్గా ఎంపికయ్యారు. తమ్ముడు భరత్ కుమార్ , ఇప్పటికే సింగరేణి సంస్థలో డిప్యూటీ మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సీనియర్ ఆడిటర్గా విజయం సాధించినప్పటికీ, రవి అసలు లక్ష్యం సివిల్ సర్వీసెస్.అత్యున్నత పదవులను చేపట్టడమే ధ్యేయంగా ఆయన తన ప్రిపరేషన్ను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ, తన విజయానికి తండ్రి జగన్, తల్లి చంద్రకళ, భార్య శ్రీ కవిత, తమ్ముడు భరత్ కుమార్,మరదలు సంధ్య కుటుంబ సభ్యులు మరియు బంధు మిత్రులు అందించిన ప్రోత్సాహమే కారణమని కృతజ్ఞతలు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ