తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, నోడల్ అధికారులతో కలిసి *“కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమం – 2025”*పై సమీక్ష సమావేశం మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, శరీరంపై రాగి వర్ణంలో లేదా చర్మ రంగుకంటే తక్కువ రంగులో మచ్చలు కనిపించి, ఆ మచ్చలపై స్పర్శ (సెన్సేషన్) లేకపోతే కుష్టు వ్యాధిగా అనుమానించాల్సిందిగా సూచించారు. అటువంటి వ్యక్తులను వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించి వైద్యాధికారులచే పరీక్షలు నిర్వహించి గుర్తించాలని తెలిపారు.ఈ మచ్చలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో అంగవైకల్యం ఏర్పడి కుటుంబానికి భారంగా మారే ప్రమాదం ఉందని, కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. జిల్లా ప్రజలందరూ 14 రోజుల కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ గుర్తింపు ఉద్యమం ఈ నెల 18వ తేదీ నుండి 31వ తేదీ వరకు 14 రోజుల పాటు నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో ఆశ కార్యకర్తలు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ప్రతి ఇంటిని సందర్శించి ప్రతి వ్యక్తిని పరిశీలించడం జరుగుతుందని, ఈ సర్వేను విజయవంతంగా పూర్తిచేయాలని ఆశ కార్యకర్తలను కోరారు.ప్రస్తుతం జిల్లాలో 45 కుష్టు వ్యాధి కేసులను గుర్తించి వారికి ఉచితంగా మందులు అందించడం జరుగుతోందని తెలిపారు. జిల్లా ఏర్పాటు అయినప్పటి నుండి ఇప్పటివరకు మొత్తం 582 కుష్టు వ్యాధి కేసులను గుర్తించి చికిత్స అందించగా, అందులో 532 మంది పూర్తిగా చికిత్స పొంది ఆరోగ్యవంతులుగా మారారని వివరించారు.ఈ గుర్తింపు ఉద్యమంలో మొత్తం 2,29,336 ఇండ్లను, 1,407 మంది ఆశ కార్యకర్తలు పాల్గొని సందర్శించనున్నారు. గత మార్చి నెలలో నిర్వహించిన కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమంలో 2,29,336 గృహాలను సందర్శించి 1,702 అనుమానిత కేసులను గుర్తించగా, అందులో 25 మందికి కుష్టు వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స అందించడం జరిగింది.గత సంవత్సరాల వారీగా గుర్తించిన కేసుల వివరాలు:2019లో – 62 కేసులు,2022–23లో – 38 కేసులు,2023–24లో – 36 కేసులు, 2024లో – 25 కేసులు ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్వో జయలక్ష్మి గారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు విధిగా సమయపాలన పాటించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని సిబ్బంది అందరూ అటెండెన్స్ రిజిస్టర్, మూమెంట్ రిజిస్టర్లను తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. అలాగే ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీల ప్రసవ క్యాలెండర్లను సక్రమంగా నిర్వహిస్తూ, ప్రమాదకర గర్భిణీ స్త్రీలను ముందస్తుగా గుర్తించి అవసరమైతే ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ తుకారం రాథోడ్ ,ఏవో ప్రసాద్, NLEP ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పుల్లారెడ్డి, బద్రు పీటీ, మోహన్ డీపీఎం, డీపీఓ సరిత, జిల్లా వైద్యాధికారులు, నోడల్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ