తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గేద, ఆవు పాల కంటే మేకపాలు ఎంతో శ్రేష్టమైనవి అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సోమవారం కొత్తగూడెం ఫుడ్ కోర్ట్ నందు మహిళా శక్తి క్యాంటీన్ లో మేకపాల విక్రయ స్టాల్ ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మహిళా శక్తి క్యాంటీన్ సభ్యులతో ముచ్చటించి మహిళా శక్తి క్యాంటీన్ ద్వారా వారు విక్రయిస్తున్న ఆహార పదార్థాల వివరాలను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. అనంతరం వారు ఇచ్చిన మేకపాలను త్రాగారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల కు వెళ్లే విద్యార్థులకు తప్పనిసరిగా మేకపాలు త్రాగించాలని ఇవి ఎంతో శ్రేష్టమైనవి మరియు స్వచ్ఛమైనవి అని అన్నారు. జిల్లావ్యాప్తంగా రెండు లక్షల మేకలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం మార్కెట్లో గేద, ఆవు పాలు లీటర్ 80 రూపాయల వరకు ధర ఉన్నదని అదే ధరకు మేకపాలు కూడా విక్రయించవచ్చని ఇవి ఎంతో ఆరోగ్యకరమని తెలిపారు. జిల్లాలోని రైతులు ముందడుగు వేసి లీటర్ నుండి ప్రారంభించినప్పటికీ రైతులకు 3000 నుంచి 4000 రూపాయలు అదనపు ఆదాయం కూడా లభిస్తుంది అన్నారు. ఈ మేకపాలను విక్రయించడం ప్రారంభించడం ద్వారా జిల్లాలో సంవత్సరానికి 50 కోట్ల వ్యాపారానికి అవకాశం ఉందన్నారు. జిల్లాలో మేకల పెంపకానికి పశు గ్రాసానికి అనువైనది అన్నారు. నగరాల్లో మేకపాలతో పన్నీరు, చీజ్ వంటివి తయారుచేసి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని మన ప్రాంతంలో కూడా వీటిని వినియోగించడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అని రైతులు ఈ దిశగా అడుగులు వేయాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి వెంకటేశ్వర్లు, డాక్టర్లు ఆనందరావు, బాలకృష్ణ, రామకృష్ణ మరియు సంతోష్, గోపాలమిత్ర సత్యనారాయణ మరియు మహిళా శక్తి క్యాంటీన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ