తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎల్-నినో ప్రభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై గణుగపాడులో రైతులకు అవగాహన .ఎల్-నినో ప్రభావం నేపథ్యంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు బోరు బావుల కింద వరి సాగుకు దూరంగా ఉండి, నీటి వినియోగం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు సూచించారు. గురువారం చెండ్రుగొండ మండలం గణుగపాడు గ్రామంలో మండల వ్యవసాయ అధికారి (ఎంఏఓ)తో కలిసి నిర్వహించిన రైతుల అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎల్-నినో ప్రభావం వ్యవసాయంపై చూపే ప్రభావం, వర్షాభావ పరిస్థితుల్లో అనుసరించాల్సిన సాగు విధానాలు, పంటల వైవిధ్యీకరణ ఆవశ్యకతపై రైతులకు అవగాహన కల్పించారు.బోరు బావులపై ఆధారపడి వరి సాగు చేయడం వల్ల నీటి లభ్యతపై తీవ్ర ఒత్తిడి ఏర్పడటంతో పాటు పంట నష్టపోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ఆయిల్ పామ్, అపరాలు (పప్పుధాన్యాలు), కూరగాయలు, మొక్కజొన్న, జొన్న వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా తక్కువ నీటితో మెరుగైన దిగుబడులు సాధించవచ్చని సూచించారు.వ్యవసాయంలో పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహిస్తూ అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించాలని, శాస్త్రీయ సాగు పద్ధతులను అవలంబించాలని, వ్యవసాయ శాఖ అధికారుల సాంకేతిక సూచనలు, సలహాలను పాటించాలని రైతులకు సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించుకోవడం ద్వారా నష్టాలను నివారించడంతో పాటు స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చని పేర్కొన్నారు.ఈ సందర్భంగా రైతుల సమస్యలు, సందేహాలను తెలుసుకుని తగిన సూచనలు చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ