తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఏఐటీయూసీ సమ్మె నోటీసుపై ఆర్ ఎల్ సి సమక్షంలో యాజమాన్యంతో రెండో విడత చర్చలు.మెడికల్ బోర్డుపై ఏఐటీయూసీ వాదనకు స్పందించిన ఆర్ఎల్సీ. రీ-మెడికల్ పరిశీలించాలని యాజమాన్యానికి సూచన.ఆగస్టు 6లోగా సమస్యలు పరిష్కారం కాకపోతే ఆగస్టు 16 నుంచి అన్ని సంఘాలను కలుపుకొని సమ్మెకు వెళ్తాం: ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ వెల్లడి.సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీసుపై మంగళవారం హైదరాబాద్లో కేంద్ర కార్మిక శాఖ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ డా. సస్వతీ రాథ్ సమక్షంలో రెండో విడత చర్చలు జరిగాయి.ఏఐటీయూసీ తరఫున అధ్యక్షులు వి. సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కె. రాజ్కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి ఎం. రంగయ్య, ఉప ప్రధాన కార్యదర్శులు కె. వీరభద్రయ్య, వై.వి. రావు, ఎం.సమ్మయ్య పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యం తరఫున డిప్యూటీ జనరల్ మేనేజర్ (పర్సనల్) బి. రాజగోపాల్ హాజరయ్యారు.సమ్మె నోటీసులో ప్రధాన డిమాండ్గా ఉన్న మెడికల్ బోర్డు అంశంపై యాజమాన్యం ఇప్పటికే బోర్డు నిర్వహించామని తెలిపింది. అయితే, బోర్డు ద్వారా పరీక్షించిన కార్మికులను పారదర్శకంగా ఫిట్ లేదా అన్ఫిట్గా ప్రకటించకపోవడంతో అనేక మంది కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఏఐటీయూసీ వాదించింది.వాదనలను విన్న అసిస్టెంట్ లేబర్ కమిషనర్,ఈనెల 17,18 మెడికల్ బోర్డులో పరీక్షించిన కార్మికులకు రీ-మెడికల్ పరీక్ష నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని యాజమాన్యానికి సూచించారు.భవిష్యత్తులో ఇలాంటి వివాదాలకు తావులేకుండా మెడికల్ బోర్డులను క్రమం తప్పకుండా నిర్వహించాలని కూడా స్పష్టం చేశారు.అదేవిధంగా, తదుపరి చర్చలకు ముందే యాజమాన్యం, ఏఐటీయూసీ మధ్య ద్వైపాక్షిక సమావేశం నిర్వహించి సమ్మె నోటీసులో పేర్కొన్న అన్ని డిమాండ్లపై సానుకూలంగా చర్చించి, ఆ సమావేశ నివేదికను తదుపరి విచారణలో సమర్పించాలని ఆర్ ఎల్ సి ఆదేశించారు.ఇరు పక్షాలు పరస్పర చర్చల ద్వారానే సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించిన అసిస్టెంట్ లేబర్ కమిషనర్, తదుపరి విచారణకు నిర్ణయాధికారం కలిగిన అధికారిని యాజమాన్యం తప్పనిసరిగా హాజరుపరచాలని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో తదుపరి చర్చలను ఆగస్టు 6, 2026 ఉదయం 11 గంటలకు వాయిదా వేసినట్టు తెలిపారు.అనంతరం ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ, ఆగస్టు 6న జరిగే చర్చల్లో సమస్యలకు సానుకూల పరిష్కారం లభించకపోతే ఆగస్టు 16 నుంచి సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని నిరవధిక సమ్మెకు దిగుతామని వాసిరెడ్డి సీతారామయ్యా,కొరిమి రాజ్ కుమార్ స్పష్టం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ