తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రోగుల సేవలకు మరింత బలం.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీవీవీపీ ఆసుపత్రులకు 69 మంది స్టాఫ్ నర్సుల కేటాయింపు.జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ కి డీసీహెచ్ఎస్ డా. జి. రవి బాబు, నర్సింగ్ సూపరింటెండెంట్ల కృతజ్ఞతలు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) పరిధిలోని అన్ని ఆసుపత్రులు గత కొన్ని సంవత్సరాలుగా స్టాఫ్ నర్సుల తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నాయి. నర్సుల కొరత కారణంగా క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలను జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది.మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలించి, ఇటీవలే ఇచ్చిన రెగ్యులర్ నర్సుల రిక్రూట్మెంట్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీవీవీపీ ఆసుపత్రులకు మొత్తం 69 మంది స్టాఫ్ నర్సులను కేటాయించింది. ఈ నిర్ణయం జిల్లాలో ప్రభుత్వ వైద్య రంగానికి ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలవడంతో పాటు, ఆసుపత్రుల్లో నర్సింగ్ సేవలను గణనీయంగా బలోపేతం చేయనుంది.ఈ అదనపు నర్సింగ్ సిబ్బందితో అత్యవసర, ఇన్పేషెంట్, ప్రసూతి, శస్త్రచికిత్స, ఐసీయూ తదితర సేవలు మరింత సమర్థవంతంగా అందుబాటులోకి రానుండగా, ముఖ్యంగా వర్షాకాలంలో పెరుగుతున్న రోగుల అవసరాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆసుపత్రుల పరిపాలనకు ఇది ఎంతో ఉపశమనాన్ని కలిగించనుంది.ఈ సందర్భంగా జిల్లాలోని ఏడు టీవీవీపీ ఆసుపత్రుల నర్సింగ్ సూపరింటెండెంట్లు డీసీహెచ్ఎస్ డా. జి. రవి బాబు తో కలిసి జిల్లా కలెక్టర్ అంకిత్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు.నర్సింగ్ సిబ్బంది కొరత పరిష్కారానికి చూపిన ప్రత్యేక చొరవ, నిరంతర సహకారం, అలాగే సకాలంలో తీసుకున్న చర్యలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే, ఈ ప్రతిపాదనకు సానుకూల స్పందన తెలిపి జిల్లాకు 69 మంది స్టాఫ్ నర్సులను కేటాయించిన రాష్ట్ర గౌరవ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కి, రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి డా. క్రిస్టినా జెడ్. చోంగ్తుకి, వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.నర్సింగ్ సిబ్బంది బలోపేతం కావడం ద్వారా జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవల నాణ్యత మరింత మెరుగుపడి, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలకు నాణ్యమైన, సత్వర మరియు సమర్థవంతమైన వైద్య సేవలు మరింత చేరువ అవుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో జిల్లా కలెక్టర్ అందిస్తున్న నాయకత్వం, సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డా. జి. రవి బాబు, జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ ప్రతినిధి డా. వీరబాబు, నర్సింగ్ సూపరింటెండెంట్లు ఫ్లోరెన్స్ పద్మ, భారతి, రేవతి, జయ, ఝాన్సీ, ఆశా వర్ధిని, శారద, సీత, రాధాకుమారి పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ